Site icon vidhaatha

Telangana Vikasa Samithi: రాజ్యాంగ విలువలు కాపాడడమే పౌరుల విధి: ఎర్రోజు శ్రీనివాస్‌

విధాత: భారత రాజ్యాంగం(Constitution of India)ప్రసాదించిన హక్కులు, చట్ట పరమైన రక్షణలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందని తెలంగాణ వికాస సమితి (Telangana Vikasa Samithi) ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్(Erroju Srinivas) అన్నారు.

ఈ మేరకు మంగళవారం హబ్సిగూడలో తెలంగాణ వికాస సమితి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మనదేశంలో పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మొదలైనవి రాజ్యాంగం ద్వారా సంక్రమించాయన్నారు.

గత 75 సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలు రాజ్యాంగాన్ని గౌరవించడానికి కారణం అన్ని వర్గాల ప్రయోజనాలకు రాజ్యాంగం ద్వారా రక్షణ లభించడమేనని తెలిపారు. అటువంటి సార్వజనీన ఆమోదం ఉన్న రాజ్యాంగాన్ని లేదా రాజ్యాంగంలోని మౌలిక అంశాలను పాలకులు పట్టించుకోకపోతే దేశంలోని బలహీన వర్గాల ప్రజలందరికీ అన్యాయం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య పరిపాలన, స్వీయ అభివృద్ధి అనే లక్ష్యాలను నిర్దేశించుకొని పాలనా వ్యవస్థను భారతీయీకరణ చేయాలని అంబేడ్కర్ భావించారన్నారు.

భారతీయీకరణ పేరుతో ప్రజాస్వామ్య ప్రక్రియ విలోమ దిశలో ప్రయత్నాలు జరగడం దేశ భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. రాజ్యాంగ విలువలు, విశిష్టత పై యువతలో అవగాహన పెంపొందించడానికి తెలంగాణ వికాస సమితి పూనుకోవాలన్నారు. అనంతరం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.

హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రాజమహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రమేష్ బాబు, సమన్వయకర్తగా ప్రవీణ్ కుమార్‌ను ఎన్నుకున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులుగా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వీర్రాజు, సమన్వయకర్తగా లక్ష్మీనారాయణను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ప్రకాష్, పిండిగ వెంకన్న, మియాపురం రమేష్, రూబి స్టీవెన్ సన్, ఆసరి రాజు, లక్ష్మణ్, ఉత్తమ్, అజయ్ కుమార్, శ్రీనివాసచారి, సూర్యప్రకాశ్, వీరనారాయణ, నటరాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version