Vijayadashami | సంక్రాంతి తర్వాత సినిమాలకు పెద్ద సీజన్ అంటే.. దసరా అనే చెప్పుకోవాలి. దసరాకి స్కూళ్లకి, కాలేజీలకి సెలవులు ఎక్కువగా, నవరాత్రులు జరగడం వంటి అంశాలతో.. సినిమా థియేటర్లు కూడా కళకళలాడుతుంటాయి. అందుకే స్టార్ హీరోలు సంక్రాంతి లేదంటే దసరాకి వారి సినిమాలని రెడీ చేస్తూ ఉంటారు. అయితే ఈ అక్టోబర్లో రాబోయే దసరాకి కూడా పోటీ మహారంజుగా ఉండబోతోంది. ఎప్పటిలాగే ఈ దసరాకి కూడా ఏకంగా బాక్సాఫీస్ బద్దలయ్యే జాబితాలోకి వెళ్లే విధంగా వివిధ […]
Vijayadashami |
సంక్రాంతి తర్వాత సినిమాలకు పెద్ద సీజన్ అంటే.. దసరా అనే చెప్పుకోవాలి. దసరాకి స్కూళ్లకి, కాలేజీలకి సెలవులు ఎక్కువగా, నవరాత్రులు జరగడం వంటి అంశాలతో.. సినిమా థియేటర్లు కూడా కళకళలాడుతుంటాయి. అందుకే స్టార్ హీరోలు సంక్రాంతి లేదంటే దసరాకి వారి సినిమాలని రెడీ చేస్తూ ఉంటారు. అయితే ఈ అక్టోబర్లో రాబోయే దసరాకి కూడా పోటీ మహారంజుగా ఉండబోతోంది.
ఎప్పటిలాగే ఈ దసరాకి కూడా ఏకంగా బాక్సాఫీస్ బద్దలయ్యే జాబితాలోకి వెళ్లే విధంగా వివిధ జోనర్లకి చెందిన సినిమాలు.. సినీ అభిమానులకు కన్నుల పండుగని ఇవ్వడానికి ముస్తాబవుతున్నాయి. ఈసారి బరిలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు ఉండటం చూస్తుంటే.. దసరాకి థియేటర్లలో మోత మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ దసరాకి పోటీ పడబోతోన్న ఆ స్టార్ హీరోలెవరంటే..
‘భగవంత్ కేసరి’తో బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా అంటేనే మాసెస్ కోసం వచ్చే సినిమా. ‘అఖండ, వీర సింహా రెడ్డి’ లాగే ఈసారి కూడా అదే యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో ‘భగవంత్ కేసరి’గా బాలయ్య బరిలోకి దిగబోతున్నాడు. బాలయ్యకి పండుగ సెంటిమెంట్స్ బాగా కలిసి వస్తుంటాయి. ఆ సెంటిమెంట్ ప్రకారమే బాలయ్య ఈసారి దసరాని టార్గెట్ చేస్తున్నాడు.
షైన్ స్క్రీన్ బ్యానర్లో హరీష్ పెద్ది, సురేష్ గారపాటి నిర్మిస్తోన్న సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. హిట్ల మీద హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడికి ఇదే బాలకృష్ణతో మొట్టమొదటి సినిమా. బాలయ్య మాస్, అనిల్ రావిపూడి ఆల్రౌండర్ ప్రతిభ ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం టాలీవుడ్ క్రష్ శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’ బరిలోకి దిగనున్నాడు.
‘టైగర్ నాగేశ్వరరావు’గా మాస్ రాజా
హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా క్రేజ్ పెంచుకుంటున్న హీరో మాస్ మహారాజా రవితేజ. ఈసారి మరింత కొత్తగా, మొట్టమొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్తో బరిలోకి దిగుతున్నాడు. బాలయ్య, రవితేజల పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ పోటీపై అప్పట్లో రకరకాలుగా వార్తలు కూడా వినిపించాయి. ఆ వార్తలని పక్కన పెడితే.. తొలిసారి భారీ బడ్జెట్తో, పాన్ ఇండియాను టార్గెట్ చేస్తున్న మాస్ రాజా.. ఈ దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’గా దోచేసేందుకు సిద్ధమవుతున్నాడు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో రానున్న ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్కి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 20న ఈ సినిమా విడుదలకు కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్లు హీరోయిన్లుగా నటించారు. స్టూవర్ట్ పురం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి.
‘లియో’తో లోకేష్, విజయ్ కాంబో..
‘విక్రమ్’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు ఇళయదళపతి విజయ్తో మరోసారి జతకట్టాడు. ‘మాస్టర్’గా మెరిపించిన ఈ జంట నుంచి ఇప్పుడు ‘లియో’ పేరుతో ఓ సినిమా సిద్ధమైంది. లోకేష్ కనగరాజ్ సినిమాలకు ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉన్నారో తెలియని విషయం కాదు. ఇప్పుడీ సినిమాలో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
సెవెన్ స్క్రీన్ బ్యానర్లో లలిత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో త్రిష, అర్జున్, గౌతమ్ మీనన్, మిస్కిన్ తదితరులు నటించారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. అందులో కోలీవుడ్లో ఇప్పుడు రజనీకాంత్ రికార్డులు క్రియేట్ చేశాడు. ఆ రికార్డులను విజయ్ చెరిపేయాలి.. లేదంటే ఆయన గాలి పోతుంది. అందుకే కసిగా విజయ్ ఈసారి దిగుతున్నాడు.
ఈ సినిమా బాలయ్య ‘భగవంత్ కేసరి’ రిలీజ్ రోజే అంటే అక్టోబర్ 19నే విడుదల అవుతుండటంతో మరింత ఆసక్తి పెరిగిపోయింది. ‘విక్రమ్’ సినిమాకి అద్భుతంగా సంగీతం అందించిన అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందించారు. భారీ అంటే భారీ అంచనాలున్నాయి ఈ సినిమాపై. ఇలా ఈ దసరాకి ఈ ముగ్గురు హీరోలు తలబడుతున్నాయి. మరి చివరికి విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే.. విజయదశమి వరకు వేచి చూడాల్సిందే.