ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్రి సభ్య కమిటీ
రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు

- సభ్యులుగా చిన్నారెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరామ్, ఐఏఎస్ అధికారి దివ్య
- నిర్ణయించిన సీఎం రేవంత్
విధాత: రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి నేతృత్వంలో జేఏసీ ఛైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరామ్, ఐఏఎస్ అధికారి దివ్యను సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీరాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు వింటుంది. వినతులు స్వీకరిస్తుంది. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులను పరిశీలించి పరిష్కరించేందుకు ఈ కమిటీ కృషి చేయనున్నది.
మార్చి 10వ తేదిన రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి ఎంసీహెచ్ ఆర్డీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా సంఘాల ప్రతినిధులు ఇచ్చిన విజ్ఞప్తులు వినతులన్నింటినీ పరిశీలించి, ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వీటిని పరిశీలించి సాధ్యాసాధ్యాలు, పరిష్కార మార్గాలను సూచించే బాధ్యతను త్రిసభ్య కమిటీకి అప్పగించారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పరిష్కరించే దిశగా సలహాలు సూచనలతో నివేదికను అందజేయాలని కమిటీకి సూచించారు.