- మోడీ పతనానికి మిర్యాలగూడ నుంచే శ్రీకారం
- లూటీ చేసే విధంగా కేంద్ర బడ్జెట్
- కార్పొరేటర్ల చేతిలోనే దేశ సంపద
- ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయాలి
విధాత: ప్రధాని నరేంద్రమోదీ గిరిజన ద్రోహిగా నిలిచారని, గిరిజన రిజర్వేషన్ ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నాడని ఆదివాసి అధికార్ మంచ్ జాతీయ నాయకులు మాజీ ఎంపీ ఆరోపించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం జరిగిన గిరిజన సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పాటుచేసిన మహా ప్రదర్శన, బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బృందాకారత్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నాడని అందులో భాగంగానే గిరిజన సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో కోత విధించాడని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గిరిజన మహిళలు పౌష్టికాహరం లోపంతో అనారోగ్యం చెందుతుంటే మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఆదివాసి గిరిజనులకు చెందాల్సిన వాటా కేంద్ర బడ్జెట్లో జనాభా ప్రకారం పెట్టలేదని విమర్శించారు. గిరిజనులకు ద్రోహం చేసే విధంగా బడ్జెట్ ఉందని, ట్రైబల్ సబ్ ప్లాన్ తీసేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దేశ జనాభాలో 8.6% ఉన్న గిరిజనులకు కేవలం 2.7% మాత్రమే నిధులు ఇచ్చారని ఇది గిరిజనుల పొట్ట కొట్టడమేనని చెప్పారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లూటీ తీసే విధంగా ఉందని ధ్వజమెత్తారు. 200 రోజులు పరిధిలో కల్పించాల్సిన ఉపాధి హామీలు వందరోజులే పని కల్పించి, చేసిన ఆ పని కూడా వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా మోడీ బుల్ డోజర్ రాజకీయం చేస్తున్నాడని, దానిని అడ్డుకున్నందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కార్మిక కర్షక వర్గం శ్రమించిన దేశ సంపద ఒక్క శాతం ఉన్న కార్పొరేట్ వారికి దోచిపెడుతున్నాడని ఆరోపించారు. నేడు దేశంలో ధనికుల పేదల మధ్య తీవ్ర వ్యత్యాసం పెరిగిందని వాపోయారు. కష్టపడుతున్న కార్మిక, కర్షకులకు మోడీ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. ఎన్నికల ముందు ధరలు పెరిగాయని వాటిని తగ్గిస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చాక మోడీ ధరలను రెట్టింపు చేశాడని దాని ఫలితంగా సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహమ్మారి కరోనా సమయంలో పేదలకు ఉచితంగా అందించాల్సిన ఆహార పదార్థాలను ఇవ్వకుండా రేషన్ షాపుల ఎత్తేసే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. డిజిటల్ ఇండియాలో గిరిజన ప్రాంతాల్లో నివసించే గిరిజన విద్యార్థులు కోవిడ్ సమయంలో ఇంటర్నెట్, ఆన్లైన్ సౌకర్యాలు లేక చదువుకు దూరమయ్యారని వాపోయారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గిరిజన యూనివర్సిటీలకు కేవలం కోటి రూపాయలు మాత్రమే బడ్జెట్లో నిధులు కేటాయించాలని దీనిబట్టి చూస్తే గిరిజన పట్ల మోడీకి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు.
అటవీ హక్కు చట్టానికి తూట్లు పొడిచి అడవులలో జీవించే గిరిజనులను తరిమికొట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. బిజెపికి వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటానికి స్వాగతిస్తున్నామని మోడీ చేసే విధానాలే కేసీఆర్ అమలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పొడు భూములకు పట్టాలిస్తామని కేసీఆర్ ఇటీవల హామీ ఇచ్చారని ఆ హామీలు నిలబెట్టుకోవాలని చెప్పారు. ఇచ్చిన హామీల అమలు చేయకపోతే గిరిజన సమక్షంలో సమరశిల పోరాటాలు చేస్తామన్నారు.
ఈ మహాసభల వేదిక నుంచి మోడీ పతనానికి మిర్యాలగూడ వేదిక నుంచే శ్రీకారం చుడతామని చెప్పారు. గిరిజన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి గిరిజన ప్రజలు అండగా నిలవాలన్నారు. రాబోయే అసెంబ్లీ కురుక్షేత్రంలో రంగారెడ్డికు గిరిజనులు మద్దతు ఇచ్చి తమ సత్తా చాటాలన్నారు.
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్, సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిఐటియు రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దిరావత్ రవి నాయక్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రవి నాయక్,కొర్ర శంకర్ నాయక్,
రైతుసంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జున రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, వివిధ సంఘాల నాయకులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, సయ్యద్ హాసం, లక్ష్మీనారాయణ వరలక్ష్మి, రాగిరెడ్డి మంగారెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, పాదూరి శశిధర్ రెడ్డి ఎండి అంజాద్ మల్లు గౌతంరెడ్డి మాలోతు వినోద్ నాయక్ చౌదరి సీతారాములు, పరుశురాములు, రొంది శ్రీను, జటంగి సైదులు తదితరులు పాల్గొన్నారు.