TS Rythu Runa Mafi | 1.66 లక్షల మందికి రుణమాఫీ కాలే..
TS Rythu Runa Mafi | సాంకేతిక సమస్యల వల్లే జమకాలేదు వారికీ రుణామాఫీ అయ్యేలా చూడాలి పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ సెల్ జిల్లాకో వ్యవసాయ శాఖ నోడల్ ఆఫీసర్ టెలికాన్ఫరెన్స్లో మంత్రి హరీశ్ సమీక్ష ‘రుణమాఫీలో గందరగోళం’పై స్పందన విధాత, హైదరాబాద్: రైతులకు వ్యవసాయ ‘రుణమాఫీలో గందరగోళం’పై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.64 లక్షల మందికి ఇంకా రుణ మాఫీ కాలేదని తెలిపింది. వారికి వెంటనే […]

TS Rythu Runa Mafi |
- సాంకేతిక సమస్యల వల్లే జమకాలేదు
- వారికీ రుణామాఫీ అయ్యేలా చూడాలి
- పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ సెల్
- జిల్లాకో వ్యవసాయ శాఖ నోడల్ ఆఫీసర్
- టెలికాన్ఫరెన్స్లో మంత్రి హరీశ్ సమీక్ష
- ‘రుణమాఫీలో గందరగోళం’పై స్పందన
విధాత, హైదరాబాద్: రైతులకు వ్యవసాయ ‘రుణమాఫీలో గందరగోళం’పై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.64 లక్షల మందికి ఇంకా రుణ మాఫీ కాలేదని తెలిపింది. వారికి వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం అందరికీ రుణమాఫీ అయిపోయిందని చెబుతున్నా.. అనేక మంది రైతుల ఖాతాలో నిధులు జమ కాలేదు. దీంతో ఆందోళనకు గురైన అన్నదాతలు బ్యాంకుల చుట్టూ తిరిగినా తగిన సమాధానం చెప్పేవారే లేకపోయారు.
రుణమాఫీ కాని రైతుల ఇబ్బందులపై ‘విధాత’ సోమవారం నాటి సంచికలో పతాక శీర్షికతో వార్తను ప్రచురించిన సంగతి తెలిసిందే. రుణమాఫీ విషయంలో రాజకీయంగానూ ఒత్తిళ్లు పెరగడంతో సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సోమవారం సచివాలయంలో బ్యాంకర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ 18 లక్షల 79 వేల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9654 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసిందన్నారు. ఇందులో 17 లక్షల 15 వేల మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరాయని తెలిపారు. సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.64 లక్షల మందికి ఇంకా రుణ మాఫీ కాలేదని చెప్పారు. వారికి వెంటనే రుణమాఫీ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
బ్యాంకు ఖాతాలు పనిచేయక పోవడం, అకౌంట్లను క్లోజ్ చేయడం, అకౌంట్ నంబర్లను మార్చడం, బ్యాంకుల విలీనం అనే నాలుగు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు వివరించారు. ఈ సమస్యలపై చర్చించి, మూడు పరిష్కార మార్గాలు గుర్తించారు. ఆధార్ నంబర్ల సాయంతో రైతుబంధు ఖాతాలను గుర్తించి, ఆ ఖాతాల్లో రుణమాఫీ డబ్బు వేయడం వల్ల సుమారు మరో లక్ష మందికి రుణ మాఫీ డబ్బు అందుతుంది.
ఎన్పీసీఐ సాయంతో బ్యాంకులు రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించి ప్రభుత్వానికి అందజేయాలి. వారికి ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇలా దాదాపు 50 వేల మందికి మూడు రోజుల్లోగా డబ్బు వేయాలని నిర్ణయించారు. అలాగే మిగిలినవారి వివరాలను కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఆ సమాచారం ఆధారంగా రుణమాఫీ పూర్తి చేస్తారని హరీశ్రావు తెలిపారు.
సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్
రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బ్యాంకులు రాష్ట్రస్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని మంత్రి చెప్పారు. ఒక అధికారిని నియమించి, వారి ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీని ప్రజలకు తెలియజేయాలన్నా రు. రైతులు ముందుగా బ్యాంకు స్థాయిలో సంప్రదిస్తారని, అక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయి అధికారిని సంప్రదించి సమస్యను చెప్పుకొనేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇదే తరహాలో వ్యవసాయ శాఖ తరుఫున జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ను నియమిస్తామని తెలిపారు. రుణ మాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు హరీశ్రావు స్పష్టం చేశారు. పురోగతిపై బ్యాంకుల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలన్నారు. రుణమాఫీ పొందిన వారిలో ఇప్పటి వరకు 35 శాతం మందికి మాత్రమే కొత్త రుణాలు మంజూరైనట్టు గణాంకాలు చెప్తున్నాయన్నారు.
ఈ నెలాఖరు నాటికి మొత్తం 18.79 లక్షల మంది రైతులకు పంట రుణాల రెన్యువల్ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మాఫీ చేసిన రూ.9654 కోట్ల మేర తిరిగి కొత్త లోన్ల రూపంలో రైతులకు చేరాలన్నారు. కొత్త రుణాలపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల సహకారంతో రైతులకు అవగాహన కల్పించాలని హరీశ్ రావు పేర్కొన్నారు.
రుణమాఫీ, పంట రుణాల రెన్యువల్పై ఈ నెలాఖరులో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఆయా జిల్లాల్లో రుణ మాఫీ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు అదేశాలు జారీ చేశారు. రుణ మాఫీ సంబధిత అన్ని సమస్యలు సత్వరం పరిష్కరించి రైతులకు రుణాలు అందేలా చూడాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు రెండుసార్లు రుణమాఫీ పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్, ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని హరీశ్రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.