విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళీ దేవస్థానం వసంత నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్మాల్యాపనయనము జరిగిన వెంటనే నిత్యాహ్నికం నిర్వర్తించారు. అనంతరం ఉత్సావాంగీకార ప్రార్ధన జరిపారు. అమ్మవారి అనుజ్ఞ వచ్చినట్లు సూచన రాగానే వసంత నవరాత్ర మహోత్సవ విధి ప్రారంభించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యా: వచనం, పూర్వాంగవిధి జరిపి స్నపన విధి నిర్వర్తించి కల్పోక్త ప్రకారముగా మండలారాధనలు జరిపి అగ్నిప్రతిష్ఠ, కలశస్థాపన, జపహెూమర్చానాభిషేకములు నిర్వహించారు.
పూలతో ఆలయ అలంకరణ
నువ్వు ఆలయాన్ని సందరంగా అలంకరించారు. అమ్మవారికి మల్లె పుష్పములతో లక్ష పుష్పార్చన జరిపారు. వేలాది మంది భక్తులు ఈ రోజు అమ్మవారిని దర్శించారు. బ్రహ్మను ఆరాధిస్తే సంవత్సరం మొత్తం శుభప్రదంగా ఉంటుందని శాస్త్రములు చెబుతున్నాయి. బ్రహ్మకు ప్రత్యేకంగా ఆలయాలు ఉండవు కానీ భగవంతుడు సర్వవ్యాపకత్వాన్ని కలిగి ఉన్నాడు కావున బ్రహ్మనే నమః అని అవ్యక్త రూపంలో ఉన్న బ్రహ్మను పూజించాలి. అట్లాగే “అహం బ్రహ్మస్వరూపిణీ మత్త: ప్రకృతి పురుషాత్మకం జగత్” అని దేవ్యథర్వ శీర్షంలో అమ్మవారు సెలవిచ్చింది. అంటే నేనే ఆ బ్రహ్మ స్వరూపాన్ని నా నుండియే ప్రకృతి పురుషాత్మకమైన ఈ జగత్తు ఆవిర్భవించింది అని అర్థం. అమ్మవారి ఈ వచనం మేరకు అమ్మవారిని ఆరాధిస్తే బ్రహ్మను ఆరాధించిన ఫలితం వస్తుంది.
అందుకే కేవలం వరంగల్ వాసులే కాక ఇతర ప్రాంతాల నుండి కూడా తండోప తండాలుగా భక్తులు వరంగల్ భద్రకాళీ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శిస్తారని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. వసంత ఋతువు, శరదృతువులు ప్రజలకు యమదంష్ట్రల వంటివి. ఈ రెండు ఋతువుల ప్రభావం వలన నానా విధములైన రోగములు ప్రజలను బాధిస్తాయి. ఈ రోగాల బారిన పడకుండా క్షేమంగా ఉండాలి అంటే రోగపర్వతధంబోళీర్ముత్యు దారుకుఠారిక ఐన జగన్మాతకు తొమ్మిది రోజుల పాటు నవరాత్ర వ్రతాన్ని ఆచరిస్తే జగన్మాత దయ వలన ఆ రోగాది బాధలు ప్రజల నుండి ప్రజలు విముక్తులౌతారన్న దేవీ భాగవత వచనం మేరకు అమ్మవారికి నవరాత్ర వ్రతాన్ని జరుపుతారు.
వసంత ఋతువు చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులని, శరదృతువులో ఆశ్వయుజ మాసంలో జరిపే నవరాత్రులను శరన్నవరాత్రులని అంటారు. ఈ రోజు వసంత నవరాత్ర మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా జరిపారు. ఈ రోజు ఆలయాన్ని పలువురు ప్రముఖులు దర్శించారు. తొమ్మిది రోజుల పాటు ఈ నవరాత్రులు జరుగుతాయి. వేలాదిగా ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఆలయ సహాయకమీషనర్, కార్యనిర్వహణాధికారి శేషుభారతి ఆధ్వర్యవంలో మంచినీటి వసతి, ప్రసాద వితరణ చేపట్టారు.