కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) లేకుంటే ఏపీ, తెలంగాణల మధ్య సమన్వయం ఎలా కుదురుతుంది, సమస్యలు ఎట్లా పరిష్కారమవుతాయని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరాం ప్రశ్నించారు.
విధాత, హైదారాబాద్ : కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) లేకుంటే ఏపీ, తెలంగాణల మధ్య సమన్వయం ఎలా కుదురుతుంది, సమస్యలు ఎట్లా పరిష్కారమవుతాయని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరాం ప్రశ్నించారు. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో కృష్ణా నదిపై ప్రాజెక్టులు, నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) విధివిధానాలపై ఆయన వివరణ ఇచ్చారు .కేఆర్ఎంబీకి కొత్తగా ఏ రాష్ట్రం ప్రాజెక్టులు ఇచ్చింది లేదని, ఏపీ, తెలంగాణ పరస్పరం మాట్లాడుకొని పరిష్కరించుకుంటే గొడవే ఉండదన్నారు.
రాజకీయాల నేపథ్యంలో నది జలాల సమస్యలపై ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలను పార్టీలు చేయకూడదని హితవు పలికారు. పదేళ్లుగా శ్రీశైలాన్ని ఏపీ, నాగార్జున సాగర్ను తెలంగాణ నిర్వహిస్తున్నాయని, 298 టీఎంసీలకు గతంలోనే తెలంగాణ అంగీకరించిందని స్పష్టం చేశారు. కేఆర్ఎంబీని విలన్ గా చూపించే ప్రయత్నం మంచిది కాదని, బీఆరెస్, కాంగ్రెస్ పరస్పరం విమర్శలతో కాలం గడుపుతున్నాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా రూపొందించలేదని తప్పుబట్టారు.
ఆరు ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలని విభజన చట్టంలో చెప్పారని, నీటి కేటాయింపులు మాత్రం చెప్పలేదని గుర్తు చేశారు. నాలుగు ఏపీ, రెండు తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయింపులు లేవని, తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల సమస్య పరిష్కారం కోసమే గత అక్టోబర్లో కేంద్రం కొత్త టైబ్యునల్ వేసిందని తెలిపారు. విభజన చట్టం రూపొందించిందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని విభజన చట్టం చెబుతోందన్నారు.
ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని తప్పు అంటోందని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రాల మధ్య సమస్యయం కోసమే కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. మేడిగడ్డ కుంగుబాటు ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలు రాష్ట్ర అధికారులు ఇవ్వలేదన్నారు. ఇప్పటి ప్రభుత్వం కూడా వివరాలు ఇవ్వలేదని.. ఇప్పటికైనా జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఎ) బృందానికి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు.
సర్వే చేయకుండా కట్టడం అతి పెద్ద తప్పు
రాష్ట్రం సమాచారం ఇస్తేనే ఎన్డీఎస్ఏ విచారణ చేయగలుగుతుందని, మేడిగడ్డ కట్టేటప్పుడు జియోలాజికల్ సర్వే వారి సహాయం తీసుకుని ఉండాల్సిందని వెదిరే శ్రీరామ్ అభిప్రాయ పడ్డారు. సర్వే చేయకుండా ప్రాజెక్టు కట్టడం అతి పెద్ద తప్పు అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్ పార్టీ నాణ్యత తనిఖీలు చేయడం చాలా అవసరమని, ప్రాజెక్టు నిర్మాణం వివిధ స్థాయిల్లో కంప్లిషన్ రిపోర్టులు ఇవ్వాలని, మొత్తం ప్రాజెక్టుకు ఒకేసారి కంప్లిషన్ రిపోర్టు ఇచ్చారని ఆయన విమర్శించారు.
ఎన్డీఎస్ఏ కమిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారని, వచ్చేవారం ఎన్డీఎస్ఏ కమిటీ రాష్ట్రానికి వస్తుందని, అడిగిన సమాచారం కమిటీకి ఇస్తే విచారణ సత్వరం పూర్తవుతుందని శ్రీరామ్ స్పష్టం చేశారు. తెలంగాణకు సహకరించాలని నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నానని, రాష్ట్రం నుంచి స్పష్టమైన సమాచారం అందడం లేదని, సరైన సమాచారం ఇవ్వకపోతే కేంద్రం కూడా సాయం చేయలేదని ఆయన తేల్చి చెప్పారు.