KCR | నేడు ఇంతవరకూ స్పందన లేదు గత వైఖరికే బీఆరెస్ కట్టుబడి ఉందా? ఆకు అందకుండా పోకకు పొందకుండా! మంత్రుల మాటల్లోనూ లేని స్పష్టత (విధాత ప్రతినిధి) జమిలి విధానం తీసుకురావడం ద్వారా లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం పావులు కదుపుతున్న నేపథ్యంలో ఈ విషయంలో బీఆరెస్ వైఖరేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదించిన ఒకే దేశం ఒకే ఎన్నికకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో స్పందిస్తున్నాయి. […]
KCR |
(విధాత ప్రతినిధి)
జమిలి విధానం తీసుకురావడం ద్వారా లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం పావులు కదుపుతున్న నేపథ్యంలో ఈ విషయంలో బీఆరెస్ వైఖరేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదించిన ఒకే దేశం ఒకే ఎన్నికకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో స్పందిస్తున్నాయి. టీఆరెస్ను బీఆరెస్గా మార్చి.. జాతీయ పార్టీగా అవతరించామని చెబుతున్న కేసీఆర్ మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉండటంపై పలువురు రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
2018లోనే జమిలి ఎన్నికలను సమర్థిస్తూ బీఆరెస్ తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా లా కమిషన్కు వెల్లడించింది. అయితే.. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో బీజేపీకి బీఆరెస్ దూరమైంది. మళ్లీ రెండు పార్టీలూ దగ్గరవుతున్నాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత అభిప్రాయానికే బీఆరెస్ కట్టుబడి ఉంటుందా? అనే సందేహలు ఉన్నాయి. దీనిపై బీఆరెస్ నాయకులకు ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉన్నదని అంటున్నారు. ముఖ్య నేతలు సైతం ‘ఆకుకు అందకుండా పోకకు పొందకుండా’ అన్నట్టు మాట్లాడుతున్నారని పేర్కొంటున్నారు.
మొదటి రోజే స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. బీఆరెస్ జమిలికి అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టంగా చెప్పలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతామని చెబుతూనే.. ఇంకోవైపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని, ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించామంటూ బీరాలు పలికారు. కీలక మంత్రి హరీశ్రావు సైతం కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్లు అంటూ నాటకాలకు తెరలేపుతుంటే.. బీజేపీ జమిలి పేరుతో డ్రామాలు ఆడుతున్నదని మండిపడ్డారు తప్పించి.. జమిలికి బీఆరెస్ అనుకూలమా? వ్యతిరేకమా? అనేది తేల్చలేదు.
ఇక ప్రతి సమస్యపై ట్విట్టర్లో వెంటనే స్పందించే మంత్రి కేటీఆర్.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై స్పందించలేదు. గతంలో ఒకసారి ‘వన్ నేషన్ వన్ టాక్స్.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సరైనవే అయినప్పుడు ఒకే దేశం ఒకే రిజర్వేషన్ ఎందుకు ఉండకూడదు?’ నిలదీశారు. వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లలో ఉన్న వైరుధ్యాలను ప్రశ్నించే క్రమంలో ఆయన వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని ప్రస్తావించారు.
తాజాగా బీఆరెస్ కీలక నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ సైతం ఒకవైపు తాము జమిలికి మద్దతుగా 2018లోనే లేఖ రాశామని, లోతుగా చర్చించాలని కోరామని చెబుతూనే.. మరో వైపు రాంనాథ్కోవింద్ నేతృత్వంలో మొక్కుబడి కమిటీ వేశారని విమర్శించడం గమనార్హం. పైగా ఇప్పటికే సిద్ధం చేసుకున్న స్ర్కిప్ట్ను చదివి వినిపించేందుకే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఇలా నాయకులంతా అస్పష్ట వైఖరులు వెల్లడించడం గమనార్హం.
జమిలితో కేసీఆర్కు సంకటం!
తెలంగాణ అసెంబ్లీ కాల పరిమితి 2024 జనవరి 16తో తీరిపోనుంది. ఆలోగా ఎన్నికలు పూర్తి చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సివుంది. జమిలి ఎన్నికలు లేక కలిసొచ్చే కొన్ని రాష్ట్రాలతో పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వచ్చినట్లయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమై ఎన్నికలు జరిగే దాకా రాష్ట్రంలో గవర్నర్ పాలనకు అవకాశముంది.
గవర్నర్ పాలన అంటే సహజంగానే బీఆరెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే షెడ్యూల్ మేరకు ఎన్నికలు జరుగుతాయని ఏకంగా అందరికంటే ముందుగానే 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి, ఎన్నికల సమరానికి సై అన్న బీఆరెస్కు జమిలి ప్రక్రియ రాజకీయంగా ప్రతికూలమేనని పరిశీలకులు అంటున్నారు. అనివార్యంగా జమిలికి సిద్ధపడాల్సి వస్తే.. పెద్ద కసరత్తునే కేసీఆర్ టీమ్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు.
ఎన్నికలు ఆలస్యమైతే ఇప్పటికే మొదలైన ప్రభుత్వ వ్యతిరేకత మరింత బలపడే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తోడు ప్రకటించిన అభ్యర్థులను అప్పటిదాకా కాపాడుకోవడం, క్యాడర్, ఓటర్లు చేజారి పోకుండా చూసుకోవడం, ఎంపీ అభ్యర్థుల ఖరారు.. ఇవన్నీ బీఆరెస్కు సంకటంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అదిగాక ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్లు రాని కొందరికి ఎంపీ టికెట్లు ఇస్తామన్న ఆశతో సర్దుబాటు చేయగా, రెండూ ఒకేసారి వస్తే మళ్లీ ఎమ్మెల్యే, ఎంపీల టికెట్ల వ్యవహారం రచ్చగా మారే ప్రమాదం లేకపోలేదని పరిశీలకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మార్పులు, ఎంపీ అభ్యర్థిత్వాల దిశగా మంత్రులు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తవచ్చని, అదీగాక జమిలి ఎన్నికల విధానం ప్రాంతీయ, కుటుంబ పార్టీలకు రాజకీయంగా నష్టదాయకమన్న ప్రచారం సైతం బీఆరెస్ను భయపెడుతున్నదని అంటున్నారు.
2014లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వచ్చిన సందర్భంలో బీఆరెస్కు 63 అసెంబ్లీ సీట్లు, 11 లోక్సభ సీట్లు వచ్చాయి. లోక్సభతో కలిపి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే తనకు ఎదురయ్యే నష్టాన్ని గమనించే 2018లోనే కేసీఆర్ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లీ రెండోసారి అధికారంలోకి వచ్చారు.
ఈసారి తెలంగాణ అసెంబ్లీకి పార్లమెంటు ఎన్నికల కంటే ముందే అదీ షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరుగుతాయని, మూడోసారి అధికార సాధనకు తనకు కలిసివస్తుందని కేసీఆర్ భావించారు. అందుకు విరుద్ధంగా జమిలి తెరపైకి రావడం కేసీఆర్ను ఆందోళనకు గురి చేసిందని పరిశీలకులు అంటున్నారు.