Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఢిల్లీలోని వివేక్ విహార్ ఏరియాలో ఎగిసిపడ్డ అగ్నికీలలకు 9 మంది సజీవదహనం అయ్యారు.
ఈ భవనంలోని రెండో అంతస్తులో తెల్లవారుజామున 4 గంటలకు మంటలు చెలరేగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 14 ఫైరింజన్లతో రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఇక రెండో అంతస్తు నుంచి మూడు, నాలుగు అంతస్తులకు కూడా మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది పలువురిని ప్రాణాలతో కాపాడారు. 9 మంది సజీవదహనమైనట్లు పోలీసులు నిర్ధారించారు. గాయపడ్డ వారిని గురు తేజ్ బహదూర్ ఆస్పత్రికి తరలించారు.
అగ్నిప్రమాదానికి ఏసీ బ్లాస్టే కారణమా..?
అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కానీ భవనంలో నివాసం ఉంటున్న వారు ఏసీ పేలుడే అగ్నిప్రమాదానికి కారణమని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
