పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్ !

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపింది. అంతర్రాష్ట్ర జల వివాదాలు పరిష్కరించిన తర్వాతే ముందుకెళ్లాలని సూచించింది.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Aug 06, 2026, 4:47 pm IST
Read Time: 4 mins
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్ !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతుల ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెనక్కి పంపింది. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు.

కేంద్ర పర్యావరణ శాఖలోని ఎన్విరాన్‌మెంట్ అసెస్‌మెంట్ కమిటీ (ఈఏసీ) నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 1980 గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ తీర్పుకు ఈ ప్రాజెక్టు రూపకల్పన, నీటి వినియోగ ప్రతిపాదనలు విరుద్ధంగా ఉన్నాయనే అభ్యంతరాలు వచ్చినట్లు వెల్లడించారు. గోదావరి ట్రైబ్యునల్ అవార్డును ఉల్లంఘిస్తున్నారంటూ పలు ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం వెల్లడించింది. అలాగే తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉందనే అంశాన్ని కూడా ఈఏసీ పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్లా బాబురావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పంపిన ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’ (ToR) దరఖాస్తును అంగీకరించలేదని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. అంతర్రాష్ట్ర జల వివాదాలు, సీడబ్ల్యూసీ అనుమతులు పొందాకే ముందుకెళ్లాలని ఈఏసీ కమిటీ తెలిపింది. ప్రాజెక్టుకు ముందు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ద్వారా వరద జలాల లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయించాలని కేంద్రం సూచించింది. అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించిన తర్వాతే పర్యావరణ అనుమతుల కోసం మళ్లీ దరఖాస్తు చేయాలని స్పష్టం చేసింది.

రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 200 టీఎంసీల వరద జలాలను రాయలసీమకు తరలించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల సుమారు 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే కేంద్రం తొలి దశలోనే ప్రతిపాదనను వెనక్కి పంపడంతో ప్రాజెక్టు ముందడుగు తాత్కాలికంగా నిలిచిపోయింది.