Daughter Murder | అభం, శుభం తెలియని ఓ నాలుగేళ్ల చిన్నారిని లెక్కలు చేయడం లేదన్న కారణంతో కన్న తండ్రే దారుణంగా కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో జనవరి 21వ తేదీన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానా ఫరీదాబాద్లోని సెక్టార్ 58లో ఉత్తరప్రదేశ్కు చెందిన కృష్ణ జైస్వాల్(31) తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నారు. భార్యది పగటి పూట డ్యూటీ కాగా, భర్తది నైట్ డ్యూటీ. పగటి పూట ఇంట్లో ఉంటున్న జైస్వాల్.. తన ఇద్దరు పిల్లలకు చదువు చెప్పేవాడు.
అయితే జనవరి 21వ తేదీన తన నాలుగేళ్ల కుమార్తెకు చదువు చెప్పాడు. 50 వరకు లెక్కించమని కూతురిని ఆదేశించాడు. ఆ పాప సరిగా లెక్కించకపోవడంతో.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చపాతీ కర్రతో బిడ్డపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో పాప ప్రాణాలు కోల్పోయింది.
వెలుగులోకి ఇలా..
సాయంత్రం ఇంటికొచ్చిన భార్య.. కూతురు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి షాకైంది. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లికి ఏడేళ్ల కుమారుడు అసలు విషయం చెప్పాడు. ‘నాన్న 50 వరకు లెక్కలు రాయమని అడిగాడని, రాయలేకపోతే చిన్నారిని కొట్టాడని, దానివల్లే చెల్లి చనిపోయింది’ అని తెలిపాడు.
మెట్లపై నుంచి పడిపోయిందని
నిందితుడు కృష్ణ తన నేరాన్ని దాచడానికి, తన భార్యతో పాప మెట్లపై నుంచి పడిపోయిందని అబద్ధం చెప్పాడు. కానీ అతని అబద్ధం ఎక్కువసేపు నిలవలేదు. తన కుమారుడు చెప్పిన విషయాన్ని గమనించి, ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్టు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ విషయంపై సమగ్ర విచారణ నిమిత్తం బాలిక పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకోబోతున్నట్లు వారు వెల్లడించారు.
