అటు భర్త, ఇటు ప్రియుడు.. ఇద్దరు తనకు ముఖ్యమేనని అంటోంది ఓ మహిళ. ఇద్దరితో కలిసుంటాను.. లేదంటే చనిపోతాను బెదిరింపులకు పాల్పడుతోంది. మరి అంతంటితో ఆగిందా.. అంటే లేదు. ప్రియుడి నుంచి తనను వేరు చేస్తే చనిపోతాను అంటూ కరెంట్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేసింది ముగ్గురు పిల్లల తల్లి.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన సుమన్ దేవి(35)కి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంసార జీవితం బాగానే సాగుతున్నప్పటికీ ఆమె మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏడేండ్ల నుంచి కొనసాగుతున్న సుమన్ దేవి వివాహేతర సంబంధం ఇటీవలే బట్టబయలైంది. భర్తకు తెలియడంతో ఆమెను మందలించాడు. పొరుగూరి యువకుడిని వదిలిపెట్టాలని చెప్పాడు. కానీ ఆమె వినిపించుకోలేదు. ఇద్దరితో కలిసుంటాను అని తెగేసి చెప్పింది.
ఆ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయని భర్తకు సుమన్ దేవి చెప్పింది. అయినా కూడా భర్త ఒప్పుకోకపోవడంతో.. గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కరెంట్ స్తంభాన్ని ఎక్కింది. తనను తన ప్రియుడితో వేరు చేయొద్దని, కావాలంటే ఇద్దరితో కలిసి ఉంటానని భర్తను ప్రాధేయపడింది.
అప్రమత్తమైన గ్రామస్తులు పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. క్షణాల్లోనే ఆ గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పోలీసులు ఆమెకు నచ్చజెప్పి విద్యుత్ స్తంభం పై నుంచి కిందకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.