అయోధ్య రామమందిర ప్రతిష్టాపనోత్సవం జనవరి 22న భక్తులు భారీగా అయోధ్యకు వచ్చి రద్ధీతో ఇబ్బందులు సృష్టించుకుండా అదే రోజున మీ ప్రాంతాల మందిరాల్లో పూజలు చేయాలని రామ మందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు
విధాత : అయోధ్య రామమందిర ప్రతిష్టాపనోత్సవం జనవరి 22న భక్తులు భారీగా అయోధ్యకు వచ్చి రద్ధీతో ఇబ్బందులు సృష్టించుకుండా అదే రోజున మీ ప్రాంతాల మందిరాల్లో పూజలు చేయాలని రామ మందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. రామమందిర ప్రతిష్టాపనోత్సవానికి లక్షలాది మంది తరలివచ్చే అవకాశముండటంతో ముందస్తు జాగ్రత్తగా రద్ధీని నివారించేందుకు ఆయన భక్తులకు ఈ పిలుపునిచ్చారు. మరోవైపు వచ్చే భక్తుల కోసం సాధారణ భోజనం, నిద్రించడానికి స్థలం, విడిది కేంద్రాల వంటి కనీస వసతులను అందుబాటులో ఉంచేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గర్భగుడి నిర్మాణం పూర్తిచేసినట్లు చంపత్ రాయ్ తెలిపారు.
అలాగే విగ్రహాలు కూడా సిద్ధమయ్యాయని వెల్లడించారు. కానీ, మందిర నిర్మాణం పూర్తి కావడానికి మరో రెండేళ్లు పట్టొచ్చని వివరించారు. పవిత్ర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అయోధ్య ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుతోంది. నగరంలో స్థిరాస్తి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. వ్యాపారులు, హోటళ్ల యజమానులు, పెట్టుబడిదారులు అయోధ్య కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు అమాంతం ఎగబాకాయి. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్థానిక పాలనా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల భద్రతలో భాగంగా నగరవ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. డ్రోన్లను వినియోగించడానికి సన్నద్ధమవుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అయోధ్య రైల్వేస్టేషన్లను, బస్ స్టేషన్లను ఆధునికరించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు 4.40 ఎకరాల స్థలంలో ‘టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్ ప్రాజెక్టులో భాగంగా వాణిజ్య కేంద్రాలు, పర్యాటక శాఖ కార్యాలయం, ప్రయాణికుల విడిది కేంద్రం, హస్తకళల ప్రదర్శన, భోజనశాలలు, విక్రయ కేంద్రాలు, పార్కింగ్ వంటి వసతులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయోధ్యలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని ఇటీవల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
అయోధ్యకు వెయ్యి రైళ్లు
రామమందిర ప్రారంభాన్ని పురస్కరించుకొని అయోధ్యకు వెయ్యికి పైగా రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్కత్తా, లక్నో, జమ్మూ తదితర నగరాల నుంచి ఈ రైళ్లను నడపనున్నారు. 2024 జనవరి 22న పవిత్ర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత 23వ తేదీ నుంచి సాధారణ భక్తులకు శ్రీరాముడి దర్శనం కల్పించనున్నారు. దీంతో దేశ విదేశాల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తే అవకాశం ఉన్నందున రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీకి తగినట్లు దాదాపు వంద రోజులపాటు అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. జనవరి 19 నుంచే ఈ రైళ్లను నడిపే అవకాశముంది. కొన్ని రైళ్లను భక్తుల కోసం రిజర్వు చేసి ప్రత్యేక సేవలు అందించనున్నట్లు సమాచారం.