Commercial Gas | హోటల్స్, రెస్టారెంట్లు నిర్వహించే వారికి ఇది షాకింగ్ న్యూస్. ఎందుకంటే.. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో మరోసారి కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు భారీగా పెంచేశాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్పై రూ. 195.50లు పెంచారు. దీంతో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2078.50కు చేరింది. మార్చి 1వ తేదీన 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను రూ. 114.5 కు పెంచిన సంగతి తెలిసిందే.
ఇక గృహ వినియోగాలకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ ధరలు పెంచలేదు. మార్చి 7వ తేదీన 14.2 కేజీల గ్యాస్ సిలిండర్పై రూ. 60 పెంచారు. అప్పట్నుంచి ఎలాంటి ధరలు పెంచలేదు. ప్రస్తుతం 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 913గా ఉంది.
భారీగా పెరిగిన విమాన ఇంధన ధరలు
కేవలం గ్యాస్ మాత్రమే కాకుండా, విమాన ఇంధనం ధరలు కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కిలో లీటరుకు రూ. 2 లక్షల మార్కును దాటాయి. వెస్ట్ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసులో ఆటంకాలు ఏర్పడటం, ఫలితంగా చమురు ధరలు దాదాపు 50 శాతం వరకు పెరగడం ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
