Site icon vidhaatha

congress | సెబీ చీఫ్‌ను తప్పించాలంటూ ఆగస్ట్‌ 22న కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళనలు

మాధివి పురి బుచ్‌ను సెబీ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నది. ఆగస్ట్‌ 22న అన్ని రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చినట్టు కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.
అదానీ గ్రూపులో సెబీ చీఫ్ పెట్టుబడులు పెట్టారని హిండెన్ బర్గ్ నివేదిక ఆరోపించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ఈ నిరసనలకు సిద్ధమైంది. అదానీ గ్రూపు కంపెనీలపై వస్తున్న విమర్శలపై దర్యాప్తు చేసేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ నియమించాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది.

మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, పీసీసీ అధ్యక్షుల సమావేశం న్యూఢిల్లీలో నిర్వహించారు. ‘ఈ సమావేశంలో మేం దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటైన అదానీ, సెబీకి సంబంధించి హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై చర్చించాం’ అని వేణుగోపాల్‌ తెలిపారు. ఈ కుంభకోణంలో ప్రధాని నరేంద్రమోదీ హస్తం ఉన్నదని ఆయన ఆరోపించారు. ‘రెండు అంశాలపై డిమాండ్‌ చేస్తూ మేం ఏకగ్రీవం నిర్ణయం తీసుకున్నాం. అందులో ప్రధాని పూర్తిగా జోక్యం చేసుకున్న అదానీ మెగా స్కాంపై జేపీసీ విచారణ ఒకటి. ఈ స్కాంతో ఫైనాన్షియల్‌ మార్కెట్‌ రెగ్యులేషన్‌ తీవ్రంగా ప్రభావితమైంది’ అని ఆయన చెప్పారు. మంగళవారం నాటి సమావేశంలో కుల గణన, వాయనాడ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఈశాన్యా రాష్ట్రాల్లో తాజా ప్రకృతి విపత్తులను జాతీయ విపత్తులుగా ప్రకటించాలన్న డిమాండ్‌లపై చర్చించారు.

Exit mobile version