• Telugu News
  • /National

Cyclone Montha : ప్రారంభమైన మొంథా తుఫాన్ ప్రభావం

కోస్తా జిల్లాల్లో మొంథా తుఫాన్ ప్రభావం ప్రారంభమైంది. రేపు ఏపీలోని ఒక కీలక ప్రాంతంలో తీరం దాటే ప్రమాదముంది! తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రధాని మోడీ స్వయంగా సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి ఏం హామీ ఇచ్చారు?

Reported by: Tejaswini Nanna | జాతీయం | Oct 27, 2025, 1:19 pm IST
Read Time: 3 mins
Cyclone Montha : ప్రారంభమైన మొంథా తుఫాన్ ప్రభావం

అమరావతి : మొంథా తుఫాన్ ప్రభావం ఏపీలో ప్రారంభమైంది. కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు మొదలయ్యాయి. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుఫాన్ కొనసాగుతుంది. ప్రస్తుతం చెన్నైకి 520కి.మీ, దక్షిణ ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు, కాకినాడకు 620 కిలోమీటర్ల దూరంలో , విశాఖపట్నానికి 600 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. రేపు సాయంత్రం కాకినాడలో తీరం దాటే అవకాశముందని వాతావారణ శాఖ వెల్లడించింది.

తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే కోస్తా జిల్లాలో జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలపడిపోతున్నాయి. తుఫాన్ తీవ్రత నేపథ్యంలో కాకినాడ నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్ చేశారు. పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ ధాటికి విశాఖ, కాకినాడ సముద్ర తీరంలో అల్లకల్లోలం కనిపిస్తుంది. సముద్రపు అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. తుపాన్ ఎఫెక్ట్ తో విశాఖ బీచ్ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. బీచ్ లో పర్యాటకులు ఎవరు ఉండవద్దని అధికారలు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాలకు చెందిన గ్రామాల ప్రజలను, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు.

మొంథా తుఫాన్ పై ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. తుఫాన్ ను ఎదుర్కోవడంలో, సహాయ చర్యలలో కేంద్ర పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తుఫాన్ పరిస్థితిపై సీఎం చంద్రబాబు నిరంతరం అధికారులతో సమీక్షలు కొనసాగిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.