తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై ఇద్దరు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో ఆయనపై లైంగిక వేధింపు అభియోగాల నమోదుకు ఢిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది
నమోదుకు తగిన ఆధారాలు ఉన్నాయన్న కోర్టు
న్యూఢిల్లీ: తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై ఇద్దరు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో ఆయనపై లైంగిక వేధింపు అభియోగాల నమోదుకు ఢిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. లైంగిక వేధింపు అభియోగాలను బ్రిజ్ భూషణ్పై నమోదు చేయాలని దీర్ఘకాలంగా రెజ్లర్లు చేసిన ఆందోళనకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. జూన్ 15న బ్రిజ్భూషణ్పై ఢిల్లీ పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు.
అందులో ఐపీసీ సెక్షన్ 354, 354(ఏ), 354(డీ)లను చేర్చారు. తనపై ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కైసర్గంజ్ నుంచి ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే.. ఆయన కుమారుడికి మాత్రం బీజేపీ ఇక్కడ టికెట్ ఇచ్చింది. ఆరుగురు రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన కింద ఆయనను ప్రాసిక్యూట్ చేసి, శిక్షించవచ్చని అందులో పేర్కొన్నారు. బ్రిజ్భూషణ్ శారీరకంగా తప్పుడు సంకేతాలు ఇవ్వడాన్ని తాము చూశామని సాక్షులు ప్రస్తావించని అంశాన్ని చార్జిషీటులో పేర్కొన్నారు.