Kangana Ranaut | ఎంపీ కంగనా రనౌత్ ఎన్నికపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు

బాలీవుడ్ నటి.. మండి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీస్‌లు జారీ చేసింది.

Kangana Ranaut | ఎంపీ కంగనా రనౌత్ ఎన్నికపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు

నామినేషన్ల తిరస్కరణపై బాధితుడి పిటిషన్‌

విధాత, హైదరాబాద్: బాలీవుడ్ నటి.. మండి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీస్‌లు జారీ చేసింది. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను నిర్ధేశిత ప్రమాణాల మేరకు పూర్తి చేసినప్పటికి అన్యాయంగా తిరస్కరించారంటూ కిన్నౌరావాసి లాయక్ రామ్‌నేగి దాఖలు చేసిన పిటిషలో వివరణ ఇవ్వాలని కంగనాకు నోటీస్‌లు జారీ అయ్యాయి. ఆగస్టు 21లోగా స్పందనను తెలియజేయాలని కంగనను కోర్టు ఆదేశించింది.

మండిలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాధిత్య సింగ్‌పై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంగనా రనౌత్ 74,755 ఓట్లతో గెలుపొందారు. అదే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తప్పుడు కారణాలతో తిరస్కరించారని పేర్కొంటూ స్వతంత్ర అభ్యర్థి లాయక్ రామ్ నేగి తాజాగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కంగనా రనౌత్ ఎన్నికను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆటవీ విభాగంలో పనిచేసిన తాను.. ముందస్తుగానే ఉద్యోగవిరమణ చేసినట్లు నేగి తన పిటిషన్‌లో తెలిపారు. నామినేషన్ పత్రాలతో పాటే డిపార్ట్మెంట్ నుంచి పొందిన ‘నో డ్యూ సర్టిఫికెట్‌ను జత చేసినట్లు వెల్లడించారు.

కానీ విద్యుత్తు, తాగునీరు, టెలిఫోన్ విభాగాల నుంచి కూడా సర్టిపికెట్లు తీసుకురావాలని రిటర్నింగ్ అధికారి ఆదేశించినట్లు తెలిపారు. అందుకు ఇచ్చిన ఒకరోజు గడువులోగా తాను వాటన్నింటిని తీసుకెళ్లినట్లు చెప్పారు. వాటిని తీసుకోకపోగా.. తన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. నామపత్రాలు అంగీకరించి ఉంటే తాను అక్కడి నుంచి గెలిచేవాడినని రామ్ నేగి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికను పరిగణలోకి తీసుకోకుండా పక్కనపెట్టాలని తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు