Vande Bharat | రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్. రాబోయే రోజుల్లో ప్రయాణం ఆహ్లాదకరంగా మారడంతో పాటు సులువు కానున్నది. సెమీ హైస్పీడ్, లగ్జరీ రైళ్ల వేగాన్ని పెంచేందుకు భారతీయ రైల్వేశాఖ సన్నాహాలు చేస్తున్నది. దాంతో 45 నిమిషాల నుంచి 4 గంటల వరకు సమయం ఆదాకానున్నది. ఢిల్లీ-ముంబయి మార్గంలో ప్రస్తుతం ఈ ఏర్పాట్లు చేస్తున్నది. విశేషం ఏంటంటే.. ఇందుకు ఎలాంటి ఛార్జీల పెంపు ఉండబోదని రైల్వే వర్గాలు తెలిపాయి. అహ్మదాబాద్ – ముంబయి మధ్య నడిచే వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలు ప్రస్తుతం 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో ఈ రైలు వేగాన్ని 160 కిలోమీటర్లకు చేరనున్నది. అహ్మదాబాద్-ముంబయి, ముంబయి – ఢిల్లీ మధ్య రైల్వేశాఖ ట్రాక్లను అప్డ్రేట్ చేసింది.
అదే సమయంలో అహ్మదాబాద్-ముంబుయి, ముంబయి-నాగ్డా లైన్లలో మొత్తం 126 రైలు వంతెనలు, 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ట్రాక్, ఓహెచ్ఈ, సిగ్నలింగ్ సిస్టమ్ను అప్డేట్ చేశారు. ఇందు కోసం రూ.6661.41కోట్లు ఖర్చయ్యాయి. అయితే, మిషన్ రాఫ్తార్ కింద ట్రాక్ అప్గ్రేడేషన్తో ఇప్పుడు సెమీ హైస్పీడ్ రైళ్లు 160 కి.మీ వేగంతో నడపనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఛార్జీలపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంటున్నారు. వేగం పెరగడంతో రన్నింగ్ టైమ్లో తేడా వస్తుందని చెబుతున్నారు. అన్ని వందే భారత్ రైళ్లు, శతాబ్ది, రాజధాని, దురంతో, తేజస్ ఎక్స్ప్రెస్ తదితర రైళ్లను గంటకు 160 కిలో మీటర్ల వేగంతో నడవనున్నాయి. మిగతా రైళ్ల స్పీడ్ పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ప్రస్తుతం రైళ్ల టైమ్టేబుల్ని సైతం అప్డేట్ చేయబోతున్నారు. ఈ విషయంలో రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా ఈ మార్గాల్లో యాంటీ కొలిజన్ సిస్టమ్. పనులు చివరి దశలో ఉన్నాయి. పలుచోట్ల ట్రయల్స్ విజయవంతంగా జరిగాయి.
మిషన్ రాఫ్తార్ కింద ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్ల వేగాన్ని పెంచేందుకు భారతీయ రైల్వే కృషి చేస్తోంది. దాంతో పాఉట గూడ్స్ రైళ్ల వేగాన్ని కూడా పెంచనున్నారు. మిషన్ రాఫ్తార్ కింద, ఈ రైళ్లన్నింటి సగటు వేగాన్ని మరింత పెంచనున్నారు. రైళ్ల వేగాన్ని పెంచేందుకు పూర్తి ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఇందులో ట్రాక్లు, సిగ్నల్ సిస్టమ్, ఓవర్ హెడ్ పరికరాలు, రైలు కోచ్లు, ఇంజిన్లను అప్గ్రేడ్ చేయనున్నారు. ప్రాజెక్టు కింద బైపాస్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఈ మిషన్ కింద, రైల్వే అన్ని డీజిల్ ఇంజిన్లు, మెము అంటే మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లుగా మార్చనున్నారు. భారతీయ రైల్వే మిషన్ రాఫ్తార్ కింద.. తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని చేరుకోవాలనే లక్ష్యం నిర్దేశించుకుంది. లాంగ్ రూట్ రైళ్ల కోసం మిషన్ రాఫ్తార్ కింద రైళ్ల వేగాన్ని గంటకు కనీసం 160 కిలోమీటర్లకు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీని కింద రైళ్లలో మార్పులే కాకుండా రైల్వేలోని మొత్తం మౌలిక సదుపాయాల్లో కూడా అవసరమైన మార్పులు చేస్తున్నారు. రైలు ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా తగ్గించే ప్రణాళిక సైతం ఇందులో ఉన్నది.