భారత నౌకాదళంలో సరికొత్త యుద్ధనౌక ‘మహేంద్రగిరి’

భారత నౌకాదళంలోకి సరికొత్త యుద్ధనౌక 'INS మహేంద్రగిరి' చేరింది. 'మహేంద్రగిరి' చేరిక..భారతదేశ సముద్ర సరిహద్దు రక్షణ బలగాల శక్తిని మరింత బలోపేతం చేయనుంది.

భారత నౌకాదళంలోకి సరికొత్త యుద్ధనౌక ‘INS మహేంద్రగిరి’ చేరింది. ‘మహేంద్రగిరి’ చేరిక..భారతదేశ సముద్ర సరిహద్దు రక్షణ బలగాల శక్తిని మరింత బలోపేతం చేయనుంది. శనివారం విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..’మహేంద్రగిరి’ నౌకకు జెండా ఊపి జలప్రవేశం చేయించి నౌకాదళ తూర్పు విభాగానికి అంకితం చేశారు.తూర్పు కనుమల్లోని ప్రసిద్ధ పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు నామకరణం చేశారు.

భారత నౌకాదళం అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్ర గిరి చేరిక దేశ రక్షణ రంగంలో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. ప్రాజెక్ట్ 17A సిరీస్‌లో భాగంగా నిర్మించిన ఆరో స్టెల్త్ ఫ్రిగేట్ ‘ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి’ని నిర్మించారు. ఈ ఆరో అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్‌ను ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించగా మజ్‌గాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇందులో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలనే ఉపయోగించారు.

శత్రువుల రాడార్ల కంటికి చిక్కకుండా తప్పించుకునే స్టెల్త్ ఫీచర్లు, హై-డిగ్రీ ఆటోమేషన్, గాలిలో, నీటిపై, నీటి లోపల అన్నికోణాల్లో దాడులు చేయగల స్వదేశీ ఆయుధాలు, సెన్సార్స్‌, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్ ఈ నౌక ప్రత్యేకతలు. మహేంద్రగిరి కమీషనింగ్‌ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. దేశానికి చెందిన 90 శాతానికి పైగా వాణిజ్యం సముద్రం ద్వారానే జరుగుతోందని, అందుకే దేశ ఆర్థిక వృద్ధికి, ఇంధన భద్రతకు సముద్ర రక్షణ అత్యంత కీలకమని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యుద్ధ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.

 

Latest News