Lightning strikes : ఉత్తరాదిన పలు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈశాన్యంలోని అస్సాంతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లో పిడుగుపాటు కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలన్నీ ఒకేరోజు సంభవించాయి. వీటి కారణంగా మరికొందరు గాయపడ్డారు.

వర్షాలు, వరదల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎడతెరిపిలేని వర్షాలకుతోడు వేర్వేరు ప్రాంతాల్లో పడిన పిడుగుల కారణంగా 38 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఒక మహిళ, చిన్నారులు కూడా ఉన్నారు. పిడుగుపాటువల్ల ప్రతాప్‌గఢ్‌లో అత్యధికంగా 11 మంది మరణించారు. సుల్తాన్‌పుర్‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌పురలో ఐదుగురు, ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మరణించారు.

మరికొన్ని జిల్లాల్లో ఒక్కొక్క మరణం సంభవించాయి. రానున్న ఐదు రోజుల్లో యూపీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పొరుగు రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం కొనసాగుతుందని అంచనా వేసింది.