సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు..హడలిపోయిన బ్యాంకు సిబ్బంది

మరణించిన సోదరి ఖాతాలోని డబ్బుల విత్ డ్రాకు.. ఆమె చనిపోయిందని నిరూపించడం కోసం ఆమె అస్థిపంజరాన్ని ఓ వ్యక్తి బ్యాంకుకు తీసుకొచ్చిన ఘటన వైరల్ గా మారింది.

విధాత : మరణించిన సోదరి ఖాతాలోని డబ్బుల విత్ డ్రాకు.. ఆమె చనిపోయిందని నిరూపించడం కోసం ఆమె అస్థిపంజరాన్ని ఓ వ్యక్తి బ్యాంకుకు తీసుకొచ్చిన ఘటన వైరల్ గా మారింది. ఒడిస్సాలోని కేంఝర్‌ జిల్లా దియానలి గ్రామానికి చెందిన జీతూ ముండా(50) అనే గిరిజనుడి సోదరి కల్రా ముండాకు (56) ఒడిశా గ్రామీణ బ్యాంకుకు చెందిన మాలిపోసి శాఖలో ఖాతా ఉంది. జనవరి 26న కల్రా ముండా మరణించింది. అప్పటికే ఆమె ఖాతాలో రూ.20వేల నగదు ఉంది. ఆ సొమ్మును విత్‌డ్రా చేసి ఇవ్వాలని సోదరుడు జీతూ బ్యాంకు సిబ్బందిని కోరాడు. ఖాతాదారు వస్తేనే.. సొమ్మును విత్‌డ్రా చేయడానికి వీలవుతుందని వారు షరా మామూలుగా చెప్పేశారు. నా సోదరి మరణించిందని జీతూ చెప్పిన అందుకు నమ్మకం ఏందని..ఆమెను తీసుకొస్తేనే..లేదా చనిపోయినట్లుగా రుజువులతో వస్తేనే డబ్బు ఇస్తామని స్పష్టం చేశారు.

దీంతో నిరక్ష్యరాస్యుడైన జీతూ బ్యాంకు అధికారుల ముందు తన సోదరి మరణాన్ని ఎలా దృవీకరించాలో తెలియక..ఏకంగా అక్క సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని తీసుకుని బ్యాంకుకు వెళ్లాడు.  శ్మశానం నుంచి అక్క అస్థిపంజరాన్ని భుజాన మోస్తూ రోడ్డుపై వెలుతున్న జీతూను చూసి ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళన చెందారు. మనిషి అస్థిపంజరంతో బ్యాంకుకు వచ్చిన జీతూను చూసిన బ్యాంకు సిబ్బంది హడలిపోయారు. వెంటనే ఈ ఘటనపై బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి జీతూకు డబ్బుల విత్ డ్రాకు సహకరిస్తామని చెప్పి అతడిని అక్కడి నుంచి అస్థిపంజరంతో సహా పంపించేశారు. అనంతరం జీతూ తన సోదరి అస్థిపంజరాన్ని సమాధి చేశాడు.

ఈ సంఘటనపై నెటిజన్లు రకరకాలు కామెంట్లు పెడుతున్నారు. నిరాక్ష్యరాస్యుడైన జీతూకు సోదరి మరణ దృవీకరణకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియ తెలియక పోవడంతోనే అతను ఈ తీవ్రమైన చర్యకు పాల్పడ్డాడని కామెంట్లు పెట్టారు. మరికొందరు మాత్రం జీతూకు విత్ డ్రా సమస్య పరిష్కారంలో అనుసరించాల్సిన పద్దతులపై బ్యాంకు అధికారులు సరైన అవగాహాన కల్పించలేకపోవడాన్ని తప్పుబడుతూ కామెంట్లు పెట్టారు.

 

Latest News