Shyam Rangila | దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. వివిధ పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నో నియోజకవర్గాల్లో వింతపోరు జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఒకే కుటుంబసభ్యులు ప్రత్యర్థులుగా ఉంటే మరికొన్ని నియోజకవర్గాల్లో సామాన్యులు బరిలో ఉన్నారు. ఓ నియోజకవర్గంలో చెప్పులు కుట్టే వ్యక్తి, మరో నియోజకవర్గంలో పండ్ల వ్యాపారి, ఇంకో నియోజకవర్గంలో నిరుద్యోగి బరిలో ఉన్నారు.
Shyam Rangila : దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. వివిధ పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నో నియోజకవర్గాల్లో వింతపోరు జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఒకే కుటుంబసభ్యులు ప్రత్యర్థులుగా ఉంటే మరికొన్ని నియోజకవర్గాల్లో సామాన్యులు బరిలో ఉన్నారు. ఓ నియోజకవర్గంలో చెప్పులు కుట్టే వ్యక్తి, మరో నియోజకవర్గంలో పండ్ల వ్యాపారి, ఇంకో నియోజకవర్గంలో నిరుద్యోగి బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీపై వారణాసి పార్లమెంట్ స్థానంలో ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ పోటీ చేస్తున్నారు.
మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా (29) వారణాసి నుంచి ప్రధాని మోదీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. రాజస్థాన్కు చెందిన శ్యామ్ రంగీలా ప్రధాని మోదీ వాయిస్ను అనుకరిస్తూ మిమిక్రీ చేయడం వల్లనే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆయనపైనే పోటీకి దిగారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడంపై శ్యామ్ రంగీలా మాట్లాడుతూ.. ‘ఇప్పటికీ దేశంలో ప్రజాస్వామ్యం జీవించే ఉందని తెలియజేయడానికే తాను ప్రధానిపై పోటీకి దిగుతున్నాను’ అని చెప్పారు.
ఈ వారం చివరలో నామినేషన్ దాఖలు చేయడానికి ఆయన వారణాసికి చేరుకోనున్నారు. కాగా వారణాసి నుంచి వరుసగా గత రెండుసార్లు ఎంపీగా గెలిచిన ప్రధాని మోదీ మూడోసారి కూడా విజయం సాధిస్తాననే దీమాతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పూర్వాంచల్లో బాహుబలి నేతగా పేరొందిన అజయ్రాయ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి మోదీ చేతిలో ఓడిపోయారు. తూర్పు ఉత్తరప్రదేశ్లో చాలా ప్రాంతాలను ప్రభావితం చేయగలరనే ఆయనను బరిలో దించారు.