మోదీ ప్రపంచంలో నిజాలను చెరిపివేయగలరేమో కానీ.. వాస్తవం నుంచి చెరిపివేయలేరని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం పార్లమెంటు ప్రాంగణం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చెప్పాలనుకున్నది చెప్పాను
న్యూఢిల్లీ: మోదీ ప్రపంచంలో నిజాలను చెరిపివేయగలరేమో కానీ.. వాస్తవం నుంచి చెరిపివేయలేరని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం పార్లమెంటు ప్రాంగణం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చెప్పాలనుకున్నది చెప్పాను. అది వాస్తవం. ఎంతకావాలంటే అంత వాళ్లను తొలగించుకోమనండి. కానీ.. సత్యమే జయిస్తుంది’ అని చెప్పారు. సోమవారం ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తున్నారంటూ బీజేపీ ప్రభుత్వంపై, మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
ఇదిలాఉంటే.. మంగళవారం స్పీకర్ ఓంబిర్లాకు ఒక లేఖ రాసిన రాహుల్ గాంధీ.. సోమవారం లోక్సభలో తాను చేసన ప్రసంగం నుంచి కొన్ని భాగాలను తొలగించడంపై నిరసన వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో భాగాలను తొలగించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకే విరుద్ధమని పేర్కొన్నారు. సభలో చేసిన నిర్దిష్ట వ్యాఖ్యలను తొలగించే అధికారం సభాపతికి ఉన్నప్పటికీ.. సభా నిర్వహణపై 380వ నిబంధన కింద పేర్కొన్న పదాలను మాత్రమే తొలగించాల్సి ఉంటుందని తెలిపారు. తన ప్రసంగంలో కొన్ని భాగాలను తొలగించడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తాను సభ దృష్టికి తీసుకొచ్చేందుకే ప్రయత్నించానని పేర్కొన్నారు. సోమవారం నాడు కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగంలో మొత్తం ఆరోపణలే ఉన్నాయని, కానీ అందులోనుంచి ఒక్క పదం కూడా తొలగించలేదని రాహుల్గాంధీ గుర్తు చేశారు. దాదాపు గంటా నలభై నిమిషాలపాటు సోమవారం లోక్సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. హిందూయిజం పేరిట విద్వేషాలను రెచ్చగొట్టడం, అగ్నివీర్ పథకం, మణిపూర్ అంశం, పెద్ద నోట్ల రద్దు వంటి అనేక అంశాలపై సాగింది.