విధాత: నాగ్పూర్-హైదరాబాద్-బెంగళూరు రాష్ట్రాలను కలుపుతూ రాకపోకలను మరింతగా పెంచాలని కేంద్రం రెండేండ్ల కిందట నిర్ణయించింది. ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించాలనే లక్ష్యంతో నూతన రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని భావించింది. నాగ్పూర్-బెంగళూరు వరకు జాతీయ రహదారి నిర్మాణాన్ని ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు అనుసంధానించాలని నిర్ణయించారు. దీనికోసం డీపీఆర్ రూపొందించడానికి కసరత్తు చేపట్టారు. డీ
పీఆర్ తయారీకి గుత్తేదారును ఎంపిక చేయడానికి కేంద్ర రవాణ, జాతీయ మంత్రిత్వ శాఖ టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు సెప్టెంబర్ 12ను తుది గడువుగా నిర్ణయించారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని నూతన రహదారిని ఆరు లైన్లలో నిర్మించాలని ప్రతిపాదించారు. మొదట 12 లైన్ల రహదారి నిర్మించాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ ఆరు లైన్లకే పరిమితమైనట్లు అధికారులు వెల్లడించారు. ఒకేసారి ఆరు వరుసలు నిర్మిస్తారా?మొదట నాలుగు లైన్లు నిర్మించి తర్వాత మరో రెండు లైన్లు విస్తరిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. డీపీఆర్ ఆమోదం తర్వాత కేంద్రం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
హైదరాబాద్-బెంగళూరు నూతన రహదారిని హైస్పీడ్, గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేగా నిర్మించాలని నిర్ణయించారు. 120 కిలోమీటర్ల వేగంతో వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రతిపాదించారు. తాత్కాలిక అంచనాల ప్రకారం 508.461 కి.మీ మేర కారిడార్ను రూపొందించాలన్నది నిర్ణయం. 44వ జాతీయ రహదారిగా హైదరాబాద్ నుంచి బెంగళూరు 556 కి.మీ. నాలుగు లైన్ల మార్గం అందుబాటులో ఉన్నది. తెలంగాణలో 190, ఏపీలో 260, కర్ణాటకలో 106 కి.మీ. వరకు ఈ నేషనల్ హైవే విస్తరించింది.
ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నందున ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల రహదారిని 6 లైన్లకు విస్తరించాలని మొదట నిర్ణయించింది. దాని కోసం 2022లోనే డీపీఆర్ సిద్ధం ను సిద్ధం చేసింది. అయితే వివిధ కారణాలతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. హైస్పీడ్ కారిడార్ను కేంద్ర నిర్ణయించడంతో ప్రస్తుత జాతీయ రహదారి తీరుతెన్నులను అధ్యయనం చేయించింది. హైస్పీడ్కు తగిన రీతిలో ఆ రోడ్డును విస్తరించడం సాధ్యంకాదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. అందుకే హైస్పీడ్, గ్రీన్ఫీల్డ్ కారిడార్ను నిర్మించాలని నిర్ణయించి మంత్రిత్వ శాఖ మాస్టర్ ప్లాన్ను ప్రతిపాదించింది.