Site icon vidhaatha

Jammu Kashmir polls । బీజేపీకి జమ్ముకశ్మీర్‌ షాక్‌.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌-కాంగ్రెస్‌ కూటమి

Jammu Kashmir polls । జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన దానకంటే ఎక్కువ మెజార్టీని నేషనల్‌ కాన్ఫరెన్స్‌- కాంగ్రెస్‌ కూటమి సాధించింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా జమ్ము కశ్మీర్‌ ప్రజలకు మేలు చేశామని చెప్పుకొన్న బీజేపీ మాటలను రాష్ట్ర ప్రజలు పట్టించుకోలేదు. వాస్తవానికి జమ్ముకశ్మీర్‌లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందని తొలుత ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొన్నా.. స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోయిన కూటమి.. మెజార్టీ మార్కును దాటింది. తాజా లెక్కల ప్రకారం 90 సీట్లు ఉన్న అసెంబ్లీలో కూటమి 49 సీట్లలో విజయం సాధించింది. బీజేపీ 29 సీట్లలో గెలుపొందింది. పీడీపీ

ముఖ్యమంత్రిగా ఒమర్‌ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరిస్తారని ఎన్‌సీ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా ప్రకటించారు. ఆర్టికల్‌ 370 రద్దును జమ్ముకశ్మీర్‌ ప్రజలు వ్యతిరేకించారనేందుకు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘ప్రజలు తమ తీర్పునిచ్చారు. 2019 ఆగస్ట్‌ 5న తీసుకున్న నిర్ణయాలను తాము ఆమోదించడం లేదని రుజువు చేశారు’ అని ఆయన అన్నారు. ఎన్నికల్లో పాల్గొని తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించారంటూ జమ్ముకశ్మీర్‌ ప్రజలను ఆయన అభినందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌ రైనా నౌషేరా స్థానంలో ఓడిపోయారు.

అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వచ్చిందని ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. ‘అంతా పారదర్శకంగా ఉండాలి. ఏం జరిగినా పారదర్శకంగా జరగాలి. ప్రజా తీర్పునకు తూట్లు పొడవకూడదు. తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నందున బీజేపీ ఎలాంటి కుతంత్రాలకు పాల్పడరాదు’ అని అబ్దుల్లా శ్రీనగర్‌లో మీడియాతో అన్నారు. ‘పార్లమెంటు ఎన్నికల్లో ప్రజా తీర్పును మేం ఆమోదించినట్టు ప్రజా తీర్పును రాజ్‌భవన్‌, కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి’ అని అబ్దుల్లా చెప్పారు. ఒమర్‌ అబ్దుల్లా తాను పోటీ చేసిన రెండు సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. బడ్‌గామ్‌ నుంచి ఏడో రౌండ్‌ తర్వాత 8500కుపైగా ఓట్లతో, గండర్‌బల్‌లో ఆరు రౌండ్ల అనంతరం 5వేలకు పైగా ఓట్లతో దూసుకుపోతున్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత నజీర్‌ అహ్మద్‌ ఖాన్‌ గురెజ్‌ నుంచి వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. సమీప బీజేపీ ప్రత్యర్థి ఫకీర్‌ మహ్మద్‌ ఖాన్‌పై 1132 ఓట్లతేడాతో గెలిచారు. రాంమాధవ్‌ పని చేయలేదు.. రక్షణ మంత్రి పనిచేయలేదు. నేను ఇక్కడ ప్రజల కోసం పనిచేశాను. నేను ఇక్కడి ప్రజల కోసం పనిచేశానని, మీరు ఇక్కడకు రావాల్సిన అవసరం కూడా లేదని ఒమర్‌ సాబ్‌కు చెప్పాను’ అని  ఒక వార్తా సంస్థతో అన్నారు.

బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలి : మెహబూబా ముఫ్తీ

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ.. రాబోయే నేషనల్‌ కాన్ఫరెన్స్‌- కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం వ్యవహర్లో జోక్యం చేసుకోరాదని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకత్వాన్ని ఆమె అభినందించారు. తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని తెలిపారు. హంగ్‌ కాకుండా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చిన జమ్ముకశ్మీర్‌ ఓటర్లను ఆమె అభినందించారు. 2019 ఆగస్ట్‌ 5 తర్వాత రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. వారి సమస్యల పరిష్కారానికి సుస్థిర, బలమైన ప్రభుత్వం అవసరమని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వాళ్లు జోక్యం చేసుకోకూడదని, జోక్యం చేసుకున్నారంటే వాళ్లకు ఇప్పటికి జరిగినదానికంటే దారుణ పరిస్థితిని ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ఎన్సీ – కాంగ్రెస్‌ కూటమి రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని ప్రజలు విశ్వసించారు. అందుకు బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడారు. దానిని పక్కన పెట్టారు. ఎన్సీ- కాంగ్రెస్‌ విజయానికి ఇదే అతిపెద్ద కారణంగా నేను భావిస్తున్నాను’ అని ముఫ్తీ చెప్పారు. ‘గోడ మీద రాశారు. ప్రజల ఓటు బీజేపీ ప్రభుత్వానికి, దాని విధానాలకు వ్యతిరేకంగా ఉన్నది’ అని సీపీఎం నేత యూసుఫ్‌ తరిగామి చెప్పారు. ఎన్సీ-కాంగ్రెస్‌ కూటమిలో సీపీఎం కూడా భాగస్వామిగా ఉన్నది.

Exit mobile version