ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో మదబలంతో విర్రవీగిన కార్పొరేట్, మతోన్మాద శక్తులకు ఉత్తరప్రదేశ్ ప్రజలు, అక్కడి సామాజిక శక్తులు తగిన గుణపాఠం చెప్పాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ అన్నారు
బీజేపీకి సీట్లు తగ్గినా.. పొంచే ఉన్న కార్పొరేట్, మతోన్మాద శక్తుల ప్రమాదం
ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా ఇండియా పార్టీలు కృషి చేయాలి
ప్రజా ఉద్యమాలను బలపరిచే కృషి సాగించాలి
వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ పిలుపు
లక్నో: ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో మదబలంతో విర్రవీగిన కార్పొరేట్, మతోన్మాద శక్తులకు ఉత్తరప్రదేశ్ ప్రజలు, అక్కడి సామాజిక శక్తులు తగిన గుణపాఠం చెప్పాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ అన్నారు. ఉత్తరప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన వెంకట్.. 80 స్థానాలున్న యూపీలో 43 స్థానాల్లో ఇండియా బ్లాక్ను గెలిపించి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను 37 స్థానాలకు పరిమితం చేయటం దేశవ్యాప్తంగా అభ్యుదయగాముకులకు, ప్రజాస్వామిక శక్తులకు గొప్ప స్ఫూర్తినిచ్చిందని అన్నారు.
కార్పొరేట్, కమ్యూనల్ శక్తులకు యూపీలో సీట్లు తగ్గటంలో గ్రామీణ పేదలు, కార్మిక కర్షకులతో పాటు సామాజిక తరగతులు ముఖ్య భూమిక పోషించాయని చెప్పారు. రాముడి పేరుతో ముస్లిం వ్యతిరేకత, కుల ఇంజినీరింగ్తో ప్రజలను చీల్చడానికి మోదీ, యోగి ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా ప్రజలు వారికి కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. ఎన్నికలకు ముందుగా హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా మోదీ రామాలయాన్ని ప్రారంభించారని, ఆ రామాలయం నిర్మాణం జరిగిన చోట ఫజియాబాద్లో ఒక దళితుడిని జనరల్ సీటులో గెలిపించడం అసాధారణమని అన్నారు.
కాగా.. ఆయన గెలుపు ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా, మతఉన్మాదాన్ని ప్రజలు తిప్పికొట్టేలా ఉందని అభివర్ణించారు. ఉన్మాదం కాదు ఉపాధి కావాలని, కార్పొరేట్ల కొమ్ము కాయటం కాదు, కష్టజీవుల, వ్యవసాయ కార్మికుల వెతలు మార్చండనే వాదన ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామమని వెంకట్ చెప్పారు. బీజేపీకి పరోక్షంగా సహకరించాలనుకున్న బీఎస్పీనీ ప్రజలు ఈసారి తిరస్కరించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీకి ఎన్నడూ లేనంతగా ఓటింగ్ 9.7పర్సంటేజ్ పడిపోయిందని అన్నారు. బిజెపి నే కాదు దానికి మిత్రపక్షాలుగా ఉన్న వారందరికీ ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.
గత పది సంవత్సరాలుగా యూపీలో రాజ్యాంగ హక్కులు అమలు కావడం లేదని అన్నారు. కార్పొరేట్ కమ్యూనల్ శక్తులు స్వైర విహారం చేస్తున్నాయని, అభివృద్ధి పేరుతో లక్షలాది ఎకరాల భూములు చిన్న సన్నకారు రైతుల నుండి బలవంతంగా లాగేసుకుంటున్నారని వెంకట్ గుర్తు చేశారు. మోడీ, యోగి మొదలు ఆర్ఎస్ఎస్, బిజెపిలు మైనారిటీల మీద చేస్తున్న దాడులు విద్వేషపూరితమైన వ్యాఖ్యలకు దేశమే కాదు, ప్రపంచమే నివ్వెరపోయిందని అన్నారు. ఇటువంటి స్థితిలో వచ్చిన ఈ ఫలితాలు దేశానికి ఒక ఆశా కిరణంగా నిలబడతాయని అన్నారు.
బిజెపికి ఎంపీ స్థానాలు తగ్గినా, హిందుత్వ ప్రమాదం మాత్రం తగ్గలేదని కార్పోరేట్ల మద్దతు కొనసాగుతున్నదని అన్నారు. ప్రజలు చైతన్యంతో ఇచ్చిన ఈ ఫలితాల ఆసరాగా ఇండియా బ్లాక్ పార్టీలు మతోన్మాద శక్తులను అరికట్టే విధంగా, సామాజిక న్యాయం సాధిన కోసం, కార్మిక కర్షక వ్యవసాయ కార్మిక ఉద్యమాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హిందుత్వం మతోన్మాదానికి వ్యతిరేకంగా సైతాంతిక కృషి స్వతంత్రంగాను కలిసొచ్చే సంఘాలతో సమైక్యంగాను నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత ఉపాధ్యక్షులు బ్రిజిలాల్ భారతి, యూపీ రాష్ట్ర అధ్యక్షులు సతీష్ కుమార్, రాష్ట్ర నాయకులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.