వారికి మళ్లీ నీట్ పరీక్ష

నీట్ -2024 పరీక్ష ఫలితాల్లో అక్రమాలు తలెత్తాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ ఫలితాల్లో వివాదానికి కారణమైన 1563మందికి మందికి పైగా అభ్యర్ధులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

  • Publish Date - June 13, 2024 / 02:14 PM IST

1563మందికి మార్కుల ఉపసంహరణ

విధాత : నీట్ -2024 పరీక్ష ఫలితాల్లో అక్రమాలు తలెత్తాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ ఫలితాల్లో వివాదానికి కారణమైన 1563మందికి మందికి పైగా అభ్యర్ధులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని చెప్పింది. నీటీ అవకతవకలపై విచారణ జరిపిన కమిటీ నిర్ణయాలను కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు నివేదించింది. గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించిందని తెలిపింది. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని, జూన్ 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తామని ధర్మాసనానికి కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాతే కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని అనుకునే వారు.. గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సెలింగ్‌కు వెళ్లొచ్చని పేర్కొంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. వెబ్ కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కౌన్సెలింగ్ యధాతథంగా ఉంటుందని చెప్పిన ధర్మాసనం.. ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగానే సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. జులై 6వ తేదీ నుంచి నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలబ్ పాండే సహా పలువురు బాధిత విద్యార్థులు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Latest News