బెంగళూరు (Bengaluru)లో భారీ దోపిడీ కలకలం రేపుతోంది. పనివాళ్లుగా చేరిన జంట అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసింది. కోట్ల రూపాయిలను కాజేసి ఉడాయించింది. పనిలో చేరిన కేవలం 20 రోజుల్లోనే పక్కా ప్లాన్తో ఇంటిని దోచుకోవడం సంచలనంగా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. నేపాల్కు చెందిన దినేశ్, కమల దంపతులు (Nepali couple).. నగరంలోని యలహంక కెంపురా మెయిన్ రోడ్డు (Kempapura Road)లో నివసించే 28 ఏండ్ల వ్యాపారవేత్త శిమంత్ ఎస్ అర్జున్ ఇంట్లో పనివాళ్లుగా చేరారు. కమల వంట పనికి ఒప్పుకోగా, దినేశ్ వాచ్మెన్ డ్యూటీలో చేరారు. పనిలో చేరిన కొద్ది రోజుల్లోనే యజమాని వద్ద నమ్మకస్తులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈనెల 25న ఆదివారం ఉదయం భూమి పూజ ఉందని శిమంత్ తన ఫ్యామిలీతో వెళ్లారు. అదే అదునుగా భావించిన నేపాలీ జంట మరో ఆరుగురితో కలిసి ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు.
ఇంట్లోని నగదు, బంగారు, వెండి, వజ్రాభరణాలతో ఉడాయించారు. ఇంట్లోని లాకర్ను కూడా పగలగొట్టారు. ఇంట్లో పనిచేసే మరో పనిమనిషి అంబిక ఈ చోరీని గమనించి వెంటనే యజమాని శిమంత్కు ఫోన్లో సమాచారం ఇచ్చింది. యజమాని హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా.. నగదు, బంగారు, వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. నిందితులు దాదాపు 11.5 కిలోల బంగారం, వజ్రాభరణాలు, 5 కిలోల వెండి ఆభరణాలు, రూ.11 లక్షల నగదుతో పారిపోయినట్లు తేలింది. అపహరణకు గురైన వాటి విలువ దాదాపు రూ.18 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని నిందితులు, వారి సహచరుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ చోరీ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి :
SIT Issues Notice To KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు
Yadagirigutta Temple : యాదగిరిగుట్ట దేవాలయంలో బంగారం, వెండి డాలర్ల మాయం !
