Puri Jagannath Rath Yatra | పూరీ జగన్నాథ రథయాత్ర తొక్కిసలాట.. ఇద్దరు అధికారులపై వేటు

Reported by: Jagan Mohan Talluri | జాతీయం | Jun 29, 2025, 10:49 pm IST
Read Time: 2 mins
Puri Jagannath Rath Yatra | పూరీ జగన్నాథ రథయాత్ర తొక్కిసలాట.. ఇద్దరు అధికారులపై వేటు

Puri Jagannath Rath Yatra| ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర మొదటి రోజే అపశృతి చోటు చేసుకుంది. శనివారం పూరీలోని శ్రీ గుండిచా ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు చనిపోగా, 50 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రథయాత్రలో తొక్కిసలాటకు బాధ్యులైన ఇద్దరు ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకుంది. పూరి ఎస్పీ వినీత్ అగర్వాల్, జిల్లా మెజిస్ట్రేట్ సిద్ధార్థ స్వేన్లపై బదిలీవేటు వేసింది. మరోవైపు పూరీ తొక్కిసలాట ఘటనపై లోతైన విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో భారీ జనసమూహం క్కిరిసిన వేళ తొక్కిసలాట చోటు చేసుకుంది. శ్రీ గుండిచా దేవాలయం సమీపంలో దర్శనం కోసం ఒకేసారి వందలాది భక్తులు ముందుకు సాగడంతో ఘటన జరిగింది. తొక్కిసలాటలో మృతులు ఖుర్దా జిల్లాకు చెందిన బసంతి సాహు(42), ప్రతివా దాస్ (52), ప్రేమకాంత మొహంతి(78) గా గుర్తించి.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. గాయపడిన భక్తులకు ట్రీట్‌మెంట్ జరుగుతోంది. అయితే, చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.