Manipur Issue | మణిపూర్లో జాతి కలహాల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ నోరు మెదపకపోవడంపై విమర్శనాస్త్రాలు సంధించాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ వ్యవహారంపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడారు. బుధవారం రాజ్యసభ వేదికగా ఈ అంశంపై స్పందించారు.
Manipur Issue : మణిపూర్లో జాతి కలహాల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ నోరు మెదపకపోవడంపై విమర్శనాస్త్రాలు సంధించాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ వ్యవహారంపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడారు. బుధవారం రాజ్యసభ వేదికగా ఈ అంశంపై స్పందించారు. మణిపూర్లో హింస నిరంతరం తగ్గుముఖం పడుతుందని అన్నారు. ఈశాన్య రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని ప్రధాని మోదీ చెప్పారు.
ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని ప్రతిపక్షాలను ప్రధాని కోరారు. ‘కొన్ని అంశాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. అలాంటి అంశాలను మణిపూర్ ప్రజలు తిరస్కరిస్తారు’ అని రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం సమాధానమిస్తూ ప్రధాని చెప్పారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కార్యాలయాలు తెరిచినట్లు తెలిపారు. ‘నేడు మణిపూర్లోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు నడుస్తున్నాయి. మణిపూర్లో కూడా ఇతర ప్రాంతాల మాదిరిగానే పరీక్షలు జరిగాయి’ అన్నారు.
ప్రధాని ప్రసంగిస్తున్నప్పుడు ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అభ్యంతరం తెలుపబోగా స్పీకర్ అనుమతించలేదు. దాంతో విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. ఆ సందర్భంలో ప్రధాని పై వ్యాఖ్యలు చేశారు. అయితే మణిపూర్లో పరిస్థితి సాధారణంగా ఉందని మోదీ చెప్పడం అశ్యర్యంగా ఉందని విపక్షాలు విమర్శించాయి. 2023 మే నెలలో మెజారిటీ మైతీలు, మైనారిటీ కుకీల మధ్య హింస చెలరేగినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మోదీ ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని గుర్తు చేశారు. అక్కడ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందని అన్నారు.