Lok Sabha members | సుదీర్ఘ కాలంపాటు సాగిన లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సొంతంగా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత మెజారిటీ సాధించలేకపోయినా 240 స్థానాలతో అధికార బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఎన్డీఏ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దక్కింది.
Lok Sabha members : సుదీర్ఘ కాలంపాటు సాగిన లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సొంతంగా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత మెజారిటీ సాధించలేకపోయినా 240 స్థానాలతో అధికార బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఎన్డీఏ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దక్కింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కసరత్తు మొదలుపెట్టింది.
అయితే లోక్సభ ఎన్నికల్లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. దాదాపు ఏడుగురు ఎంపీలు ఏడు లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అతి ఎక్కువగా 11 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నమోదైంది. అతి తక్కువగా కేవలం 48 ఓట్ల మెజారిటీ మహారాష్ట్రలోని ముంబై నార్త్వెస్ట్ స్థానంలో నమోదైంది. కేవలం 25 ఏళ్ల వయస్సు మాత్రమే ఉన్నవాళ్లు నలుగురు లోక్సభలో అడుగుపెట్టబోతున్నారు.
అంతేగాక ఈ ఎన్నికల్లో 30 మంది మహిళలు బరిలో దిగి ఏడుగురు మాత్రమే గెలిచారు. అదేవిధంగా ఒకే జిల్లాకు చెందిన ఏడుగురు నేతలు లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. అయితే ఉత్తరప్రదేశ్లోని వివిధ లోక్సభ స్థానాల నుంచి వారు విజయం సాధించారు. ఇంతకూ ఆ జిల్లా ఏదంటే ఇటావా జిల్లా. ఒకే జిల్లాకు చెందిన ఏడుగురు ఎంపీలు ఒకే పార్టీకి చెందినవారు కూడా కావడం గమనార్హం.
వారంతా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ నుంచి విజయం సాధించారు. ఒకే జిల్లాకు చెందిన ఏడుగురు నేతలు వివిధ జిల్లాలోని వేర్వేరు లోక్సభ స్థానాల నుంచి బరిలో దిగి గెలిచారు. ఇప్పుడు ఆ ఏడుగురు ఒకేసారి పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. కాగా ఒకే జిల్లాకు చెందిన ఏడుగురు ఎంపీలు ఒకే సభకు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారని ఈసీ తెలిపింది.
ఇటావా జిల్లాలోని ఇటావా లోక్సభ స్థానం నుంచి జితేంద్ర దోహ్రే, కనౌజ్ నుంచి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, మెయిన్పురి నుంచి డింపుల్ యాదవ్, అజాంఘడ్ నుంచి ధర్మేంద్ర యాదవ్, బదౌన్ నుంచి ఆదిత్య యాదవ్, ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, ఎటా నుంచి దేవేశ్ షాక్యా గెలుపొందారు. అఖిలేష్ ఈసారి ముస్లింలలో నలుగురికి మాత్రమే టికెట్లు ఇచ్చారు. ఆ నలుగురూ ఎంపీలుగా గెలిచారు.