Tripura cannabis destruction|షాకింగ్ తోటలు.. 13లక్షల గంజాయి మొక్కల ధ్వంసం

నిషేధిత గంజాయి మొక్కలను అక్రమంగా అక్కడక్కడ సాగు చేయడం చూస్తుంటాం. తోటల్లో..పంటల్లో అంతర్గతంగా కనిపించకుండా గంజాయి మొక్కలను పెంచడం..అడవి ప్రాంతాల్లో రహస్యంగా సాగు చేయడం అడపదడపా వెలుగుచూస్తుంటాయి. అయితే త్రిపుర రాష్ట్రంలో ఏకంగా తోటల మాదిరిగా గంజాయి మొక్కలను సాగు చేయడం చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Dec 01, 2025, 2:54 pm IST
Read Time: 4 mins
Tripura cannabis destruction|షాకింగ్ తోటలు.. 13లక్షల గంజాయి మొక్కల ధ్వంసం

న్యూఢిల్లీ : నిషేధిత గంజాయి మొక్కలను అక్రమంగా అక్కడక్కడ సాగు చేయడం చేస్తుంటాం. తోటల్లో..పంటల్లో అంతర్గతంగా కనిపించకుండా గంజాయి మొక్కలను పెంచడం..అడవి ప్రాంతాల్లో రహస్యంగా సాగు చేయడం అడపదడపా వెలుగుచూస్తుంటాయి. అయితే ఓ రాష్ట్రంలో ఏకంగా తోటల మాదిరిగా గంజాయి మొక్కలను సాగు చేయడం చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.

త్రిపుర రాష్ట్రం(Tripura )లో సాధారణ పంటలు, తోటల మాదిరిగా పెరిగిపోతున్న గంజాయి మొక్కల సాగు(cannabis destruction)కు చెక్ పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ కు ఆదేశించింది. ఇందుకోసం రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలను సైతం రంగంలోకి దించింది. ముందస్తుగా పక్కాగా సేకరించిన సమాచారంతో వరుస దాడులు నిర్వహిస్తుంది. పోలీసు బలగాలు లక్షలాది గంజాయి మొక్కలతో కూడిన తోటలను ధ్వసం చేస్తున్నారు. సుతర్మురా, టోక్టుమడం, చిత్త రాంబరి, ఉక్యమురా, తులమురా కమల్‌నగర్, ఘటిగర్, బిషల్‌గఢ్ డివిజన్‌లో గజారియా పంచాయతీ పరిధిలోని రామ్ చారా అంతటా బృందాలను మోహరించారు. బిష్రామ్‌గంజ్, బిషల్‌గఢ్, కలాంచురా, సోనామురా, మేలాఘర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఆయా ప్రాంతాలలో నిర్వహించిన దాడుల్లో ఇప్పటివరకు 13లక్షల మేరకు గంజాయి మొక్కలను ధ్వసం చేశారు.

నవంబర్ 18న ఒకేసారి 12లక్షలను గంజాయి మొక్కలను పోలీసు బలగాలు ధ్వంసం చేయగా..నవంబర్ 30న రామ్ చారాలో మరో 70వేల మొక్కలను ధ్వంసం చేశారు. నరికివేసిన గంజాయి మొక్కలను దగ్ధం చేశారు. మరో 30చోట్ల 30వేలకు పైగా గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. ఇప్పటిదాక ధ్వంసమైన గంజాయి మొక్కల విలువ సుమారు 55కోట్ల మేరకు ఉంటుందని అంచనా.

మాదకద్రవ్యాల వ్యతిరేక డ్రైవ్‌ లో భాగంగా గుర్తించిన గంజాయి తోటను పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బంది ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆపరేషన్ అధికారి బిజోయ్ దాస్ నాయకత్వంలో పోలీసులు 30చోట్ల సాగు చేస్తున్న గంజాయి మొక్కలను నాశనం చేశారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను చూసిన రైతులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. త్రిపురను మాదకద్రవ్య రహితంగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే ప్రయత్నాల్లో భాగంగా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.