Supreme court | భారత సైన్యంలోని జడ్జ్ అడ్వొకేట్ జనరల్ (లీగల్) బ్రాంచ్ పోస్టుల్లో మహిళా అధికారులు తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఆ పోస్టులకు స్త్రీ-పురుష నిష్పత్తి వర్తించదని నిబంధన ఉన్నప్పటికీ కేంద్రం ఎందుకు అనుసరించడం లేదని నిలదీసింది. రఫేల్ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలను సైతం మహిళలు నడుతుండగా లేనిది లీగల్ పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.
సైన్యంలోని జడ్జ్ అడ్వొకేట్ జనరల్ లీగల్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షలలో అష్నూర్ కౌర్, ఆస్థ త్యాగి అనే మహిళా అధికారులు వరుసగా 4, 5వ ర్యాంకులు సాధించారు. అయినా వీరిని విధుల్లోకి తీసుకోకపోవడంతో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పురుష అభ్యర్థులకన్నా తమకు మెరిట్ ఎక్కువగా ఉనప్పటికీ.. మహిళల కోటాల్లో ఖాళీలు లేవంటూ తమను ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి పిటిషన్పై ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత వాయుసేనలో మహిళలు రఫేల్ యుద్ధ విమానాలను నడిపేందుకు అనుమతి ఉన్నప్పుడు.. ఆర్మీలోని లీగల్ బ్రాంచీల్లో పురుషుల కంటే ఎక్కువగా మహిళలను విధుల్లోకి తీసుకోవడంలో ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. నియమకాలకు స్త్రీ-పురుష భేదంతో సంబంధం లేకుండా అవి తటస్థ పోస్టులను కేంద్రం చెప్పినప్పుడు.. మహిళలకు ఎందుకు ఎక్కువ పోస్టులను కేటాయించడం లేదు? అని ప్రశ్నించింది.
స్త్రీ-పురుష సమానత్వం అంటే మహిళలు, పురుషులకు సమాన అవకాశాలు కల్పించాలని అర్ధం కాదని..అబ్బాయిలైనా, అమ్మాయిలైనా అర్హత ఉంటే అవకాశం ఇవ్వడమే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది.