షహరాన్పూర్, అక్టోబరు 13- ఉత్తరప్రదేశ్లోని షహరాన్పూర్లో దారుల్ ఉలూమ్ దియోబంద్ను సందర్శించడానికి వచ్చిన ఆఫ్గన్ తాలిబన్ విదేశాంగమంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీకి ఉత్తరప్రదేశ్ పోలీసుల నుంచి గౌరవ వందనం లభించింది. సిగ్గులేకుండా తాలిబన్లను సమర్థిస్తున్నారంటూ సమాజ్వాది పార్టీని విమర్శించే ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇప్పుడేమంటారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. గట్టి బందోబస్తు మధ్య దియోబంద్కు చేరిన ముత్తాఖీకి ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడి విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా ముత్తాఖీ జమాయత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్శద్ మదానీని, అనేక మంది ఇస్లామిక్ పండితులను కలిశారు. ఆయనకు ఈ సందర్భంగా ఇస్లామిక్ సంప్రదాయంలో హాదిత్ సనద్(ఆశీర్వచనం) లభించింది. తన పర్యటన భారత-ఆఫ్గన్ సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలదని ముత్తాఖీ ఈ సందర్భంగా అన్నారు.