జయలలిత బంగ్లాను కొనుగోలు చేయనున్న సీఎం విజయ్ !?

చెన్నై పోయోస్ గార్డెన్‌లోని దివంగత జయలలిత నివాసం ‘వేద నిలయం’ను సీఎం విజయ్ కొనుగోలు చేయనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

దివంగత మాజీ సీఎం జయలలిత బాటలో సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. తమిళనాడు సీఎం పదవిని అధిష్టించిన టీవీకే అధినేత, సీఎం విజయ్ ఇప్పుడు ఆమె నివాసంపై కన్నేసినట్లుగా తెలుస్తుంది. చెన్నై పోయోస్ గార్డెన్ లో ఉన్న జయలలిత బంగ్లా వేద నిలయంను రూ. 350 కోట్లతో కొనుగోలు చేసేందుకు సీఎం విజయ్ సిద్దమైనట్లుగా ప్రచారం సాగుతుంది. ఈ భవనం కొనుగోలుకు సంబంధించి జయలలిత వారసులతో చర్చలు తుది దశకువచ్చాయని కథనం. జయలలిత మరణం తర్వాతా కోర్టు కేసుల అనంతరం వేద నిలయం భవనం ఆమె వారసుల చేతికి వచ్చింది.

ప్రస్తుతం సీఎం విజయ్ ఉంటున్న నివాసం తమిళనాడు సచివాలయానికి 18కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రాఫిక్ సమస్య వల్ల తన నివాసం మార్చాలని విజయ్ భావిస్తున్నారు. జయలలిత వేద నిలయం సచివాలయానికి కేవలం 8కిలో మీటర్ల దూరంలో ఉండటంతో ఈ భవనం కొనుగోలుకు సీఎం విజయ్ ఆసక్తిగా ఉన్నారని సమాచారం.

కాగా పోయోస్ గార్డెన్ లోని జయలలిత ఇంటి పక్కనే సూపర్ స్టార్ రజినీకాంత్ నివాసం కూడా ఉండటంతో ఈ వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే జయలలిత నివాసం కొనుగోలుకు సంబంధించి ఇటు విజయ్ వర్గాల నుంచి, అటు జయ వారసుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

Latest News