Gold Theft In Temple : కాంచీపురం బంగారు, వెండి బల్లులను మార్చేశారు!

తిరుమల, శబరిమల తర్వాత కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి బల్లుల విగ్రహాల మార్పిడి సంచలనంగా మారింది.

Gold theft on temples

విధాత, హైదరాబాద్ : ఆలయాల్లో బంగారం, విగ్రహాలు..హుండీ దోపిడీల పర్వం ఇటీవల సంచలనంగా మారింది. ఎందుకంటే దోపిడీకి గురైన ఆలయాలు ఏకంగా తిరుమల, శబరి, కాంచీపురం ఆలయలు కావడంతో దోపిడీ వ్యవహారం చర్చనీయాంశమైంది. తిరుమలలో పరకామణి కానుకల దోపిడీ కేసు వ్యవహరం నిత్యం వార్తల్లో ఉంటూ వస్తుండగా..ఇటీవల శబరిమల ఆలయం బంగారు తాపడం రేకులను మెరుగులు దిద్దే పనిలో ఆలయ పూజారి ఉన్నికృష్ణన్ చేతి వాటంతో 476గ్రాముల బంగారం తస్కరించి విక్రయించిన ఉదంతం వెలుగు చూసింది. ఉన్నికృష్ణన్‌ వెనుక ఇంటిదొంగల హస్తం అనే కోణంలో సిట్ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు సభ్యుల విచారణ చేపట్టింది.

వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి బల్లుల విగ్రహల మార్పు ?

టీటీడీ, టీడీబీ పరిధిలో జరిగిన దోపిడీల వ్యవహారం అలా ఉండగానే…తాజాగా కాంచీపురం వరద రాజ పెరుమాళ్ ఆలయంలో జరిగిన విగ్రహాల మార్పిడి వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో పైకప్పులోని బంగారు, వెండి బల్లుల విగ్రహాలు మార్చినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 108 దివ్య క్షేత్రాల్లో ఒకటిగా కాంచీపురం ఆలయం ప్రసిద్ది చెందింది. ఈ దేవాలయంలోని బంగారు, వెండి బల్లులను తాకేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తుల వస్తుంటారు. వాటిని తాకడం వల్ల బల్లి, సర్ప దోషాలు సమసిపోతాయని నమ్ముతుంటారు. అంతటి మహిమాన్వితమైన బల్లుల విగ్రహాలను మార్చినట్లుగా ఆరోపణలు రావడంతో భక్తులలో కలకలం రేపుతోంది.

బంగారు, వెండి బల్లుల ప్రత్యేకత

బంగారు, వెండి బల్లులకు సంబంధించిన పురాణగాథ‌ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఉండే ఇద్దరు శిష్యులు నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్‌ ఆలయంలో శాప విమోచనం లభిస్తుందని ఉపశమనం చెబుతాడు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లుల‌ రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య, చంద్రులు సాక్ష్యులుగా శిష్యుల శరీరాలు బంగారు, వెండి బల్లుల బొమ్మలుగా ఇక్కడే వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని అర్థం అని ప్రతీక. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్‌ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ప్రచారంలో ఉంది.