• Telugu News
  • /National

Lalu Family | అనుష్కతో తేజ సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు.. లాలూ సీరియస్‌

Reported by: Jagan Mohan Talluri | జాతీయం | May 25, 2025, 5:26 pm IST
Read Time: 4 mins
Lalu Family | అనుష్కతో తేజ సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు.. లాలూ సీరియస్‌

Lalu Family | బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న లాలూ కుటుంబంలో వివాదం రేగింది. పెద్ద కుమారుడు తేజ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి, కుటుంబం నుంచి వెలి వేస్తున్నట్టు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ఆదివారం ఎక్స్‌లో ప్రకటించడం సంచలనం రేపింది. అయితే.. లాలు చిన్న కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ మాత్రం భిన్నంగా స్పందించారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల వ్యవధిలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆర్జేడీ తరఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తేజస్వి అన్నీ తానై నడిపించిన విషయం తెలిసిందే.

అనుష్క యాదవ్‌ అనే మహిళతో తేజ ప్రతాప్‌ యాదవ్‌ సన్నిహితంగా ఉన్నట్టు కొన్ని వీడియోలు, ఫొటోలు వైరల్‌ అయిన నేపథ్యంలో లాలు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెడుతూ.. ‘మన వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు విస్మరిస్తే.. అది సామాజిక న్యాయం కోసం మనం చేసే ఉమ్మడి పోరాటాన్ని బలహీనపరుస్తుంది’ అని లాలు ప్రసాద్‌ పేర్కొన్నారు. నా పెద్ద కొడుకు పనులు, బహిరంగ ప్రవర్తన మా కుటుంబ విలువలకు అనుగుణంగా లేవు. అందుకే ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అతడిని నా పార్టీ నుంచి, నా కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాను. ఈ రోజు నుంచీ పార్టీలో కానీ, కుటుంబంలో కానీ అతడికి ఎలాంటి సంబంధమూ లేదు. ఆయనను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నాను’ అని ఆ ట్వీట్‌లో లాలు తెలిపారు. ‘వ్యక్తిగత జీవితంలో మంచేదో, చెడేదో, యోగ్యతలేవో, అయోగ్యతలేవో తెలుసుకోగల సామర్థ్యం అతడికి ఉంది. ఇతడితో సంబంధాల్లో ఉన్నవారు ఆ సంబంధాన్ని కొనసాగిచడంలో ఎవరి నిర్ణయం వారు తీసుకోవచ్చు’ అని లాలు తెలిపారు.

తేజ్‌ ప్రతాప్‌ ఫేస్‌ బుక్‌ ఖాతాలో శనివారం ఒక ఫొటో ప్రత్యక్షమైంది. ఫేస్‌ బుక్‌ ప్రొఫైల్‌ పిక్‌ అది. అందులో ఒక మహిళతో తేజ సన్నిహితంగా ఉన్నారు. దాని కింద వారు పన్నెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు క్యాప్షన్‌ ఉంది. తర్వాత ఆ పోస్ట్‌ డిలీట్‌ అయింది. తన ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ హ్యాక్‌ అయిందని తేజ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కానీ మరిన్ని ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చిన నేపథ్యంలో లాలూ ఈ సంచలన నిర్ణయం ప్రకటించారు. తేజ ప్రతాప్‌ యాదవ్‌ 2018లో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్‌ మనుమరాలిని వివాహం చేసుకున్నారు.