టీడీపీ ఎంపీగా గెలుపొంది కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న కింజారపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
న్యూఢిల్లీ : టీడీపీ ఎంపీగా గెలుపొంది కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న కింజారపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతల స్వీకరణ కంటే ముందు.. ఎవరూ ఊహించని విధంగా రామ్మోహన్ నాయుడు ఓం శ్రీరామ్ అని రాశారు. ఓ వైట్ పేపర్పై తెలుగులో 21 సార్లు ఓం శ్రీరామ్ అని రాసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అనంతరం కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి, కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు రామ్మోహన్ నాయుడు. ఇక ఓం శ్రీరాం అని రాసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక విజన్ 2047 ప్రణాళికతో పౌరవిమానయాన శాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. దేశంలోనే యంగెస్ట్ కేంద్రమంత్రిగా రికార్డులకెక్కిన రామ్మోహన్ నాయుడు.. తనను గెలిపించి ఈస్థాయికి తీసుకొచ్చిన శ్రీకాకుళం ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. విజన్ ఉన్న మోదీ, చంద్రబాబుల మార్గదర్శకత్వం తనకు అదనపు బలమన్నారు రామ్మోహన్ నాయుడు.
సామాన్య ప్రయాణికుల కోసం ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ పై దృష్టి పెడతామని వివరించారు. ఎయిర్పోర్టుల నిర్మాణం వేగవంతం చేస్తామని తెలిపారు. 2014లో బాధ్యతలు చేపట్టిన అశోక్గజపతిరాజు విమానయాన శాఖలో మంచి పునాదులు వేశారని కొనియాడారు. ఉడాన్ స్కీమ్ కూడా ఆయన హయాంలోనే వచ్చిందని వెల్లడించారు.