MLC Election | పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మే 27న ఉప ఎన్నిక.. షెడ్యూల్‌ ప్రకటించిన ఎన్నికల సంఘం

MLC Election | 'వరంగల్, ఖమ్మం, నల్గొండ' పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మే 27న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం.. ఈసీ మే 2న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదేరోజు నుంచి మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్‌ల సంహరణకు మే 13 వరకు గడువు విధించింది.

  • Publish Date - April 26, 2024 / 11:08 AM IST

MLC Election : ‘వరంగల్, ఖమ్మం, నల్గొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మే 27న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం.. ఈసీ మే 2న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదేరోజు నుంచి మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్‌ల సంహరణకు మే 13 వరకు గడువు విధించింది. నామినేషన్‌ల ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు కానున్నారు. మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 5న ఓట్లు లెక్కిస్తారు.

కాగా 2021లో ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్‌ఎస్‌ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ కారణంగా ‘వరంగల్, ఖమ్మం, నల్గొండ’ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాలు ఉన్నాయి.

ఆయా జిల్లాల్లోని గ్రాడ్యుయేట్స్​ఓటర్లుగా నమోదు చేసుకునే గడువు పూర్తవడంతో తాజాగా ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో పురుషులు 2,87,007 మంది, మహిళలు 1,74,794 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్నను ప్రకటించింది. 2021లో మల్లన్న ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు.

Latest News