ఆ అబ్బాయి పుట్టుకతోనే మూగవాడు. ఇతని విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మూగ వాడిని ఎందుకు కన్నావు అంటూ భార్యపై భర్త చిందులేసేవాడు. భర్తపై కోపంతో.. చివరకు ఆ మూగ ఇడ్డను తల్లి మొసళ్ల నదిలో పడేసింది.
బెంగళూరు : ఆ అబ్బాయి పుట్టుకతోనే మూగవాడు. ఇతని విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మూగ వాడిని ఎందుకు కన్నావు అంటూ భార్యపై భర్త చిందులేసేవాడు. భర్తపై కోపంతో.. చివరకు ఆ మూగ ఇడ్డను తల్లి మొసళ్ల నదిలో పడేసింది. ఈ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర కన్నడ జిల్లా దండేలి తాలుకాకు చెందిన రవికుమార్(27), సావిత్రి(26)కి కొన్నేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తొలి సంతానం మగ పిల్లాడు. ప్రస్తుతం ఇతని వయసు ఆరేండ్లు. అయితే పుట్టుకతోనే ఆ పిల్లాడు మూగ బిడ్డగా జన్మించాడు. అతనికి మాటలు రాకపోవడంతో.. మూగ బిడ్డను ఎందుకు కన్నావ్ అంటూ భార్యపై రవికుమార్ చిందులేసేవాడు. అతన్ని ఎక్కడన్న పడేయ్ అని ఆగ్రహించేవాడు. గత శనివారం కూడా ఇదే విషయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
శనివారం సాయంత్రం ఆ బిడ్డను తల్లి తీసుకెళ్లి.. మొసళ్లకు నెలవైన కాళీ నదిలో పడేసింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం బాలుడిని నదిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. బాలుడి శరీరమంతా గాయాలతో ఉంది. ఒక చేతి మాయమైంది. అయితే మొసళ్లు బాలుడిని పీక్కుతిని ఉండొచ్చని పోలీసులు భావించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.