Site icon vidhaatha

KTR: డీలిమిటేషన్.. దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుంది

విధాత: డీలిమిటేషన్ ప్రక్రియ కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని..నిధులు కేంద్రీకృతం కావడంతో పాట..ఆర్థిక నియంతృత్వానికి దారితీస్తుందని..దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన డీలిమిటేషన్ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ దేశాన్ని వెనక్కి నెడుతున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుందని ఆరోపించారు. భిన్న అస్తిత్వాలు, సంస్కృతులు కలిగిన ఒక సమాఖ్య ప్రజాస్వామిక దేశం మనదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేటీఆర్ డీలిమిటేషన్ అనేది ఆర్థిక అభివృద్ధి, పరిపాలన అభివృద్ధి వంటి అంశాల పైన జరగాలి కానీ కేవలం జనాభా పరంగా కాదన్నారు. ఈ అంశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపైన మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదన్నారు. భవిష్యత్తు తరాలు ఈరోజు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయన్నారు. ప్రస్తుత డీలిమిటేషన్ విధానంతో దేశానికి 36% జీడీపీలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయన్నారు.

కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాకుండా.. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరగబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం మరింతగా పెరుగుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదని, కానీ ఈ మధ్యకాలంలో ఈ వివక్ష అన్యాయం మరింత పెరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులన్ని ఉత్తరాదికే పరిమితం అవ్వడం ఇందుకు ఒక ఉదాహరణ అని అన్నారు.

ఆదర్శవంతమైన సమైక్య రాష్ట్ర దేశంలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం పైన ఆధిపత్యం చలాయించే విధంగా ఉండరాదన్నది ప్రజాస్వామ్యస్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదని..అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ప్రాంతాలకు నష్టం జరుగుతున్న అంశంగా చూడాలన్నారు. కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల గనుక జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉన్నదన్నారు. వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అంశాన్ని మేము ఏమి వ్యతిరేకించడం లేదు కానీ… నిధుల కేటాయింపుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ వలన ఈరోజు దక్షిణాదికి నష్టం జరగడం అన్యాయమని, జనాభా నియంత్రణను దేశ అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు పాటించాయని.. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమైనందువలన వారికి ఈరోజు డీలిమిటేషన్ లో లబ్ధి జరగడం ఏ విధంగా కూడా సరైంది కాదన్నారు.

ఇది దేశాన్ని వెనుక వేసిన వాళ్లకి రివార్డు ఇవ్వడం లాంటిదని వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే 2047 నాటికి సూపర్ పవర్ కావాలి అంటే అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహం లభించాలి కానీ శిక్ష కాదని పేర్కొన్నారు. మెజార్టీ నియంతృత్వం మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు మా తెలంగాణ ప్రజలకు తెలుసని..తెలంగాణ ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మంద బలంతో పాటు సమైక్యరాష్ట్రంలోని మెజార్టీ నాయకత్వం పైన కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి 14 సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకోవాల్సి వచ్చిందన్నారు. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడడంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చిందని.. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించుకోవడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచి లెక్క పనిచేస్తుందని కేటీఆర్ చెప్పారు.

Exit mobile version