హైదరాబాద్: కోవెంట్రీ యూనివర్సిటీ గ్రూప్, గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం) కలిసి విద్యా సహకారం, పరిశోధన బలోపేతం, భారత్, యూకేలోని విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం ఒక ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం రెండు సంస్థల మధ్య సంబంధాలను బలపరుస్తాయని ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థలు కలిసి ఒక డ్యూయల్ డిగ్రీ పీహెచ్డీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. డాక్టరల్ విద్యార్థులను అంతర్జాతీయ పరిశోధన నెట్వర్క్లో ఈ కార్యక్రమం భాగం చేస్తుంది. ఇందులో గీతం, కోవెంట్రీ యూనివర్సిటీల అధ్యాపకుల నుంచి విద్యార్థులు మార్గదర్శనం పొందుతారు.
అలాగే, అత్యాధునిక పరిశోధన సౌకర్యాలు, పరిశ్రమలతో సహకారం, రెండు దేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలను అందుకుంటారు. విదేశీ సంస్థతో మొదటి డ్యూయల్ డిగ్రీ పీహెచ్డీ కార్యక్రమం కాగా, కోవెంట్రీ యూనివర్సిటీకి ఇదే తొలిసారి. మెరుగైన అభ్యాసం, పరిశ్రమలతో అనుసంధానం, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని విశ్వ విద్యాలయ అధ్యాపకులు చెబుతున్నారు. గత ఏడాది ఢిల్లీలో ఇండియా గ్లోబల్ హబ్ను ప్రారంభించిన కోవెంట్రీ, ఆఫ్రికా, చైనా, బ్రస్సెల్స్, సింగపూర్లలో ఇప్పటికే గ్లోబల్ హబ్లను నిర్వహిస్తూ సంస్థలు, ప్రభుత్వాలు, పరిశ్రమలతో సంబంధాలను మెరుగుపరుచుకుంది. కోవెంట్రీ యూనివర్సిటీ డిప్యూటీ వైస్-చాన్సలర్ (రీసెర్చ్) ప్రొఫెసర్ రిచర్డ్ డాష్వుడ్ మాట్లాడుతూ.. “ భారత్తో ఈ సహకారం అంతర్జాతీయ పరిశోధనలో ఉత్తమ ఫలితాలను సాధించాలనే మా నిబద్ధతను నిరూపిస్తుంది. ఇది విద్యార్థులు, పరిశోధకులు సవాళ్లను ఎదుర్కొని, మంచి ఫలితాలను ఇచ్చేలా చేస్తుంది” అని అన్నారు.