Harish Rao : గెస్టు లెక్చరర్ల జీతాలు కూడా ఇవ్వరా..?
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ గెస్ట్ లెక్చరర్ల 9 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సీఎం సొంత జిల్లా వికారాబాద్లోనూ ఇదే పరిస్థితిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ గెస్ట్ లెక్చరర్ల 9 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని..వెంటనే వారికి జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి టి.హరీష్ రావు డిమాండ్ చేశారు. జీతాలు ఇవ్వక, ఉద్యోగాలు మానేసే పరిస్థితి వారికి కల్పించడం దుర్మార్గమని హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ, దసరా పండుగలు కూడా జరుపుకోకుండా లెక్చరర్లు పస్తులు ఉండేలా చేసిన పాపం ఈ పాపిష్టి కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉంటే వారి బతుకు ఎలా సాగుతుంది, కుటుంబ పోషణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అధికారులను కలిసి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో, ఓపిక నశించి కళాశాలకు వెళ్లకూడదని నిర్ణయించున్నారన్నారు. లెక్చరర్లు కళాశాలలకు వెళ్లకుంటే విద్యార్థులకు పాఠాలు ఎవరు చెబుతారు? సిలబస్ ను ఎవరు పూర్తి చేస్తారు? అని..మీ నిర్లక్ష్యం వల్ల లెక్చరర్లే కాదు, విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు.
పాఠాలు చెప్పే గురువులకే గౌరవం ఇవ్వని ప్రభుత్వం.. ఇక విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తుంది? అన్నారు. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని గెస్ట్ లెక్చరర్ల వేతనాల పరిస్థితి ఇంకెంత దారుణమో ఊహించుకోవచ్చు అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైన కోతలు కోయడం ఆపేసి, ఉద్యోగులకు జీతాలు చెల్లించడంపై దృష్టి సారించాలని హరీష్ రావు హితవు పలికారు. మీ సొంత జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల వేతనాలు వెంటనే విడుదల చేసి, మీ పరువు కాపాడుకోండని రేవంత్ రెడ్డిని కోరారు.