నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా,రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు షాక్ !

విధాత : నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. గత నెలలో ఇదే కేసులో విచారణ నిమిత్తం నిందితుకు నోటీసులు ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందించిన చార్జిషీట్లో సరైన పత్రాలు లేవని సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి నోటీసులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అయితే శుక్రవారం జరిగిన విచారణలో చార్జిషీట్ లోని లోపాలు పరిష్కరిచబడ్డాయని కోర్టు అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీ వరకు వాయిదా వేసింది. ఈ సందర్భంగా చార్జిషీట్పై న్యాయబద్ధమైన విచారణ జరిగే సమయంలో ఎప్పుడైనా అవతలి పక్షంవారు తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుందని జస్టిస్ విశాల్ గోగ్నే అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఈ కేసులోని సామ్ పిట్రోడా, సుమన్ దూబే, సునీల్ భండారి, మెస్సర్స్ యంగ్ ఇండియా, మెస్సర్స్ డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ లకు నోటీసులు జారీ చేశారు.
నేషనల్ హెరాల్డ్’ మనీలాండరింగ్ కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురి పేర్లను పొందుపరిచింది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది.
ఇటీవల ఈ కేసులో 2023, నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. ఆస్తులున్నటువంటి ఢిల్లీ, ముంబయి, లక్నో భవనాలకు నోటీసులు అంటించింది. కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ నేతలు శామ్ పిట్రోడా, సుమన్ దుబే పేర్లతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లెయింట్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ కొనసాగిస్తుంది.