Provocative Content | రెచ్చగొట్టేలా వార్తలు.. 16 పాకిస్తాన్ యూ ట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం

Provocative Content |
విధాత: జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్పై తీవ్ర చర్యలు చేపడుతోన్న భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోంమంత్రిత్వ శాఖ సిఫార్సులతో పాకిస్థాన్కు చెందిన 16 యూట్యూబ్ చానళ్లను నిషేధించింది.
వీటిలో డాన్, సామా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్, రాజీనామా, జీఎన్ఎన్, ఇర్షాద్ భట్టి, ఆస్మా షిరాజీ, ఉమర్ చీమా, మునీబ్ ఫరూఖ్, బోల్ న్యూస్, రాఫ్తార్, సునో న్యూస్, పాకిస్థాన్ రిఫరెన్స్, సామా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్ వంటి చానళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి మొత్తం 6.3 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
పహల్గామ్ దాడి తర్వాత ఈ చానళ్లు భారత్పై విషం కక్కుతున్నాయని, రెచ్చగొట్టేలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం కేంద్రం వాటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
25 మంది పర్యాటకుల మరణానికి కారణమైన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశంపైన, భారత సైన్యం, భద్రతా సంస్థల పైన రెచ్చగొట్టేలా పాకిస్తాన్ యూ ట్యూబ్ వార్తలు ప్రసారం చేస్తున్నారని కేంద్రం గుర్తించింది. ఉగ్రదాడిపై ప్రజలను తప్పుదారి పట్టించే కథనాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుండటంతో ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.