తెలంగాణలో సంచలనం రేపిన షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్కుమార్ హత్యలకు ముందు స్వయంగా రికార్డ్ చేసుకున్న వీడియోను పోలీసులు గుర్తించారు. నిందితుడి మృతదేహం వద్ద మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పరిశీలించగా.. అందులో తాను ఈ ఘాతుకాలకు ఎందుకు పాల్పడుతున్నదీ వివరిస్తూ సెల్ఫీ వీడియో చేశాడని ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. ఈ వీడియోను ఆయన మీడియాకు చూపారు. మృతురాలి కుటుంబం వల్ల తాను అప్పులపాలయ్యానని, తనను నమ్మించి ద్రోహం చేశారని రాజ్కుమార్ ఆ వీడియోలో ఆరోపించాడు.
ఈ వీడియోను ఘాతుకాలకు కొద్దిగా ముందు.. జూలై 10వ తేదీ సాయంత్రం 4.55 గంటల సమయంలో రికార్డు చేసినట్టుగా ఉంది. తన సంపాదనలో సగం వాళ్లకోసమే ఖర్చు పెట్టానని, తన వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని, తనను రోడ్డున పడేశారని తెలిపాడు. అప్పులపాలయ్యానని, పిల్లలకు రూపాయి విలువ చేసే భూమి కూడా లేకుండా అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇంత చేసీ చివరకు తనపైనే కేసు పెట్టి జైలుకు పంపారని తెలిపాడు. నమ్మి ద్రోహం చేసినందుకే వాళ్లను చంపాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.
ఇదే కేసులో మరో కీలకాంశం కూడా వెల్లడైంది. హత్యల సమయంలో బాలికను రాజ్కుమార్ ఒక కారులో తీసుకువెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్లో రికార్డయింది. బాలిక కారులో ఉండగానే తన ఇద్దరు పిల్లలను, భార్యను కూడా చంపినట్టు తెలుస్తున్నది. చివరకు బాలికను అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి గొంతుకోసి చంపేశాడు. ఈ హత్యలన్నీ కొన్ని గంటల వ్యవధిలోనే వేరువేరు ప్రాంతాల్లో చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ వీడియోతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. దర్యాప్తును వేగవంతం చేశారు.
Big Breaking News 🚨
ఆరు హత్యలకు ముందు రోజు హంతకుడు తీసుకున్న సెల్ఫ్ వీడియో
బాలికను నమ్ముకుని అన్నివిధాల మోసపోయానని.. అప్పులపాలయ్యానని
జీవితం మీద విరక్తి, సెల్ఫీ వీడియోలో చెప్పిన హంతకుడుమృతదేహం వద్ద లభించిన రాజ్ కుమార్ సెల్ ఫోన్ లో సెల్ఫ్ వీడియో ను గుర్తించిన పోలీసులు.… pic.twitter.com/k94zSJJKji
— Telangana365 (@Telangana365) July 13, 2026
