• Telugu News
  • /News

Student Suicides : ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య..ప్రాణాపాయ స్థితిలో మరొకరు!

విద్యార్థులపై చదువు ఒత్తిడి, కళాశాలల్లో వేధింపులు పెరుగుతున్న వేళ.. ఒకే రోజులో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడగా ఒకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

Reported by: Tejaswini Nanna | వార్త‌లు | Oct 31, 2025, 6:09 pm IST
Read Time: 3 mins
Student Suicides : ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య..ప్రాణాపాయ స్థితిలో మరొకరు!

విధాత : చదువుల ఒత్తిళ్లు..కళాశాలల్లో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇటీవల పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్క రోజునే తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడగా..వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీలోని విశాఖ..హెచ్‌బీ కాలనీలో డిగ్రీ విద్యార్థి సాయితేజ తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న సాయి తేజ కళాశాల మహిళా లెక్చరర్‌ లైంగిక వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. సమతా కాలేజ్‌ వద్ద స్నేహితులు, సహచరుల ఆందోళనకు దిగారు.

చిత్తూర్ సితమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ పరీక్షలకు అనుమతించలేదన్న మనస్తాపంతో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని నందిని రెడ్డి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. అకాడమిక్ బ్లాక్ మూడవ అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలకు గురైంది. ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గుడేల్గులపల్లి గ్రామంలో ఇంటర్ విద్యార్థి చిలుకూరి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంజుల,అశోక్ దంపతుల కుమారుడు గణేష్ హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు.సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చి కాలేజీలకు వెళ్లలేదు. కాలేజీకి వెళ్లి చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. ఈ నేపథ్యంలో కాలేజీకి వెళ్లడం ఇష్టం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు