విధాత: స్వయంగా ధార్మిక సంస్థ తరుపున తీర్మానాలు చేసే కమిటీ హాల్ కింద ఫ్లోర్ లోనే అన్నమయ్య భవన్ హోటల్ పేరిట నిర్వాహకుడు మూడు కోట్ల రూపాయలు టీటీడీకి చెల్లించకుండా ఎగనామం పెట్టాడు. భగవంతుడికి కానుకలు గా చెల్లించే భక్తుల సొమ్ము కాపాడతామని ప్రమాణం చేసిన ఉన్నతాధికారులే స్వయంగా ఈ అక్రమానికి వంతపాడారు. హోటల్ స్వాధీనం చేసుకున్న నాటి నుండి కోర్టు కేసుల పేరిట ఏడాదిన్నర కాలం టీటీడీకి చెల్లించాల్సిన అద్దెల సొమ్ము చెల్లించకుండా కాలయాపన చేసిన […]
విధాత: స్వయంగా ధార్మిక సంస్థ తరుపున తీర్మానాలు చేసే కమిటీ హాల్ కింద ఫ్లోర్ లోనే అన్నమయ్య భవన్ హోటల్ పేరిట నిర్వాహకుడు మూడు కోట్ల రూపాయలు టీటీడీకి చెల్లించకుండా ఎగనామం పెట్టాడు. భగవంతుడికి కానుకలు గా చెల్లించే భక్తుల సొమ్ము కాపాడతామని ప్రమాణం చేసిన ఉన్నతాధికారులే స్వయంగా ఈ అక్రమానికి వంతపాడారు. హోటల్ స్వాధీనం చేసుకున్న నాటి నుండి కోర్టు కేసుల పేరిట ఏడాదిన్నర కాలం టీటీడీకి చెల్లించాల్సిన అద్దెల సొమ్ము చెల్లించకుండా కాలయాపన చేసిన హోటల్ నిర్వాహకులను గత నెలలో టీటీడీ ఉన్నతాధికారులే స్వయంగా అద్డె డబ్బులు తీసుకోకుండా కోర్టులో కేసును వెనక్కి తీసుకునేలా చేసి, హోటల్ ఖాళీ చేయించి పంపడం వెనుక కథా కమామిషు ఏమిటో చదవండి.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి రాత్రనకా పగలనకా గర్భగుడిలో నిలబడి భక్తుల వద్ద నుండి నిలువు దోపిడీ ల ద్వారా సంపాదిస్తుంటే…. భక్తుల కానుకలనే జీతాలు గా తీసుకుంటూ.. ఆయన కొలువులో పనిచేస్తున్న టిటిడి అధికారులు మాత్రం వెంకన్న కే వెన్నుపోటు పొడిచే లా అక్రమార్కుల తో కుమ్మక్కై పోతున్నారు. టీటీడీకి చెల్లించాల్సిన కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా ఎగవేత కు పాల్పడిన తిరుమల లోని ఓ హోటల్ నిర్వాహకుడి కి పరోక్షంగా సహకారం అందించి మరీ తిరుమల నుండి దాటించారు.
తిరుమలలో దుకాణాలు ఇతరత్రా అద్దెల చెల్లింపులలో ఒక్క నెల అద్దె బకాయిలు ఉంటే కూడా ఏమాత్రం అంగీకరించని టిటిడి పెద్దలు… స్థానిక ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. కరోనా కష్ట సమయంలో కూడా స్థానిక వ్యాపారులకు అద్దెలు చెల్లింపుల లో ఒక్క రూపాయి కూడా మినహాయింపు ఇవ్వ లేదు. అయితే ఇందుకు విరుద్ధంగా టిటిడి పెద్దలు అన్నమయ్య భవన్ లోని ఓ హోటల్ నిర్వాహకులు అయిన చెన్నైకి చెందిన డీసీ హోటల్స్ సంస్థ ఏకంగా మూడు కోట్ల రూపాయల బకాయిలను టీటీడీ యాజమాన్యానికి ఎగర వేసినప్పటికీ ఏ మాత్రం నోరు మెదపకుండా ఉండిపోయారు. కనీసం వారి వద్ద నుండి బకాయిలను రాబట్టుకునే చర్యలు కూడా తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా హోటల్ ఖాళీ చేయించి వారిని రాత్రికి రాత్రే చెన్నై కి పంపించారు. మాసానికి 23.90 లక్షల రూపాయల అద్దె ఈ హోటల్ ద్వారా టిటిడికి వస్తున్నప్పటికీ కాదనుకుని బెంగళూరుకు చెందిన మరో సంస్థకు ఉచితంగా ఇవ్వడానికి ఖాళీ చేయించారు. డీసీ హోటల్ యాజమాన్యం నుండి ఇంకా రెండు కోట్ల కు పైగా రావాల్సిన బకాయిలను చేజేతులారా వదిలేసుకున్నారు.
మరోవైపు పాలక పెద్దలు ఇప్పుడు కొత్తగా జపిస్తున్న సాంప్రదాయ సేంద్రీయ సేకరణ పదార్థాల ద్వారా సాంప్రదాయ భోజనాన్ని ఇదే హోటల్ నుంచి ప్రారంభించారు. సేంద్రీయ పద్ధతుల ద్వారా పండించే బియ్యాన్ని ఒక కేజీ వంద రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఇదే బియ్యం ధరలను భక్తులకు నామమాత్రపు ధరకు సాంప్రదాయ భోజనాన్ని భక్తులకు ఆంద చేస్తారట. అసలు ఈ సాంప్రదాయ భోజనాన్ని మాకు కావాలి అని ఒక భక్తుడు కూడా అడగలేదు . కానీ టీటీడీ అధికారులకు మాత్రం ఇదో బృహత్తర కార్యం లా కనిపించింది. ఇప్పుడు టీటీడీ నెత్తిన మరింత కోట్ల రూపాయల వ్యయం, నిర్వహణ భారంగా పెట్టుకుని ఈ సంప్రదాయ భోజన పథకాన్ని నెత్తిన పెట్టుకుని బెంగళూరుకు చెందిన ఓ సంస్థకు ఇదే హోటల్ ను నామమాత్రంగానే స్వాధీనం చేసేసారు. ఇదే కాకుండా తిరుమలలో ఇంకా అనేక హోటల్స్ అన్ని కూడా బెంగళూరుకు చెందిన ఈ సంస్థ కి ఉచితంగా కట్టబెట్టే ఆలోచనలో కూడా టిటిడి ఉన్నట్లు తెలుస్తోంది.
టీటీడీ కి దాదాపు మూడు కోట్ల రూపాయల నష్టం కలిగించిన అన్నమయ్య భవన్ హోటల్ వ్యవహారం తెర వెనుక జరిగిన కథనాన్ని ఒకసారి పరిశీలిస్తే.... తిరుమలలో హోటల్స్ నడపాలంటే దాదాపు 5 కోట్ల రూపాయల వ్యాపార టర్నోవర్ ఉండాలనే నిబంధన ఉంది. ఇలాంటి నిబంధనల మేరకే తిరుమలలోని స్వయంగా పాలకమండలి సభ్యులు బోర్డు సమావేశం నిర్వహించే అన్నమయ్య భవన్ కిందిభాగంలో ఉన్న అన్నమయ్య హోటల్ ను టీటీడీ టెండర్ విధానం ద్వారా లీజుకు కట్ట పెడుతోంది. చెన్నైకి చెందిన డీసీ హోటల్స్ యాజమాన్యం తరపున రాజ గోపాల్ అనే వ్యక్తి ఈ హోటల్ ను నెలకు 23 లక్షల రూపాయల అద్దె చెల్లించే విధంగా టెండర్ల ద్వారా దక్కించుకున్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఆరు మాసాల అద్దెను డిపాజిట్ కూడా చెల్లించాలి. నిర్వాహకులు భవిష్యత్తులో టిటిడి కి టెండర్ ద్వారా నిర్ణయించిన అద్దెల సొమ్మును సక్రమంగా చెల్లించకపోతే మూడు మాసాల వరకు మాత్రమే గడువు ఇచ్చి డిపాజిట్ సొమ్మును టీటీడీ పూర్తిగా స్వాధీనం చేసుకుని హోటల్ ను వెంటనే ఖాళీ చేయించి నిర్వాహకుల వద్దనుండి టి.టి.డి స్వాధీనం చేసుకునే నిబంధనలు ఉన్నాయి.
అయితే డీసీ హోటల్ యాజమాన్యం ఇందులో విఫలమైంది. ఈ వ్యవహారంలో టీటీడీ పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి మూడు కోట్ల రూపాయల నష్టాన్ని మూటకట్టుకోవడం తో పాటు హోటల్ యాజమాన్యానికి పరోక్షంగా సహకరించింది. అదెలాగంటే… డిసీ హోటల్స్ యాజమాన్యం అన్నమయ్య భవన్ హోటల్ ను టెండర్ విధానం ద్వారా స్వాధీనం చేసుకున్న తర్వాత ఏడాదిన్నర పాటు అద్దెలు సక్రమంగా చెల్లించలేదు. దీంతో టీటీడీకి నెలకు ఇరవై మూడు లక్షల చొప్పున ఏడాదిన్నర కాలానికి నాలుగున్నర కోట్ల రూపాయల అద్దె బకాయిలు నిలిచిపోయాయి. దీనిపై టీటీడీ పంచాయతీ రెవెన్యూ అధికారులు హోటల్ యాజమాన్యం వద్దనుండి బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. బకాయిల వసూళ్లకు వెళ్ళినప్పుడల్లా పంచాయతీ, రెవెన్యూ అధికారులను హోటల్ యాజమాన్యం మామూళ్ల మత్తులోకి దింపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాలుగున్నర కోట్ల బకాయిల వసూళ్లకు హోటల్ యాజమాన్యం పై ఒత్తిడి తీసుకురాగా హోటల్ యాజమాన్యం కరోనా కారణంగా తాము బకాయిలు చెల్లించలేక పోతున్నట్లు వివిధ సాకులు, కారణాలుగా చూపించి ,తమ కు మినహాయింపు ఇవ్వాలని నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. W/A 247/2020, W/P 11021/ 2020, W/P 10877/2020 నెంబర్లతో న్యాయస్థానాల్లో నాలుగు దఫాలుగా పిటిషన్లు వేసి ఈ పిటిషన్లు సాకుగా చూపించి టీటీడీకి అద్దెలు చెల్లించకుండా కాలయాపన చేశారు.
అయితే న్యాయస్థానం హోటల్ యాజమాన్యం విజ్ఞప్తిని తోసిపుచ్చింది. పూర్తి బకాయిలు టీటీడీకి చెల్లించాల్సిందే నని ఆదేశించింది. దీనిపై మళ్లీ అప్పీలు కి వెళ్ళిన హోటల్ యాజమాన్యం గతంలో రెండు హోటళ్లకు ఇదే విధంగా టిటిడి అద్దెల చెల్లింపులో మినహాయింపు ఇచ్చిందని విజ్ఞప్తి చేసింది. దీనిపై న్యాయస్థానం కూడా టిటిడి వైఖరికి అసంతృప్తి వ్యక్తం చేస్తూ పిటిషనర్ వాదనను కొట్టివేసింది.
అయితే ఇవన్నీ తెలిసినప్పటికీ టీటీడీ అధికారులు మాత్రం ఈ హోటల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్క పెట్టారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఏ హోటల్ నిర్వాహకుడు అయినా మూడు మాసాలు పాటు అద్దెలు చెల్లించకపోతే వెంటనే చర్యలు తీసుకుని అద్దాలు రికవరీ చేసి హోటల్ ను స్వాధీనం చేసుకుని తిరిగి టెండరు నిర్వహిస్తారు. అయితే డీసీ హోటల్స్ వారికి మాత్రం ఏడాదిన్నర కాలంగా బాడుగులు చెల్లించక పోయినా ఎందుకు మినహాయింపు ఇచ్చారు?? అనే అనుమానాలు ఎవరికైనా కలగక మానవు. పైగా కోర్టు ఈ తీర్పు ఇచ్చిన తరువాత కూడా హోటల్ యాజమాన్యం వద్ద బకాయిల వసూలుకు సరైన చర్యలు తీసుకోలేదు! అంటే రెవెన్యూ అధికారుల పని తీరు ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. కోర్టు తీర్పు, బకాయిల వ్యవహారం ఇలా నడుస్తుండగానే టీటీడీలో ఓ ఉన్నతాధికారి హోటల్ నిర్వాహకులతో అనధికారిక సంప్రదింపులు జరిపారు. నాలుగున్నర కోట్ల బకాయిలకు గాను డిపాజిట్ సొమ్మును మినహాయించుకున్నారు. మరో మూడు కోట్ల రూపాయల బకాయిలను ఏ మాత్రం పట్టించుకోకుండా వారి వద్ద నుండి వసూలు చేయకుండా దయార్థ హృదయాన్ని చూపించారు. హోటల్ యాజమాన్యాన్ని ఖాళీ చేయించి పంపించారు. డిసీ హోటల్స్ యాజమాన్యం కూడా టిటిడి వైఖరితో తంతే బూరెల గంపలో పడ్డట్టు మూడు కోట్ల రూపాయలను మిగిలించుకున్న ఆనందంలో హోటల్ ను ఆగమేఘాలపై ఖాళీ చేసి
చెన్నైకి వెళ్ళిపోయింది. ధార్మిక సంస్థలో భక్తుల సొమ్ముకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు ఇలా అధర్మ పద్ధతిలో పరిపాలన సాగిస్తున్నప్పడు సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే నేత్ర దర్శనాన్ని ప్రసాదించి అక్రమాలను అరికట్టేందుకు దృష్టి సారించాలి.