విధాత: జార్ఖంఢ్ రాష్ట్రం బొకారో జిల్లాలో లాల్పానియా ప్రాంతంలోని లుగు పర్వత ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 8మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ హతమవ్వడం సంచలనంగా మారింది. అతడిని ఫుచన, నాగ, కరన్, లెతర అనే పేర్లతో కూడా పిలుస్తారు. అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే రూ.కోటి రివార్డ్ను ప్రకటించింది. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన ఎనిమిది మందిలో అరవింద్, రామ్ మాంఝీ అనే మావోయిస్టులు కూడా ఉన్నారు. వీరిపై కూడా రూ.10 లక్షలు చొప్పున రివార్డులు ఉన్నాయి. జార్ఖంఢ్లో అత్యధిక రివార్డ్ ఉన్న రెండో మావోయిస్టు ప్రయాగ్ మాంఝీ కావడం గమనార్హం. మాంఝీ కాకుండా మరో నలుగురు మావోయిస్టులపైనే రూ.కోటి రివార్డులు ఉన్నాయి. ప్రయాగ్ మాంఝీ భార్య జయాను గతేడాది పోలీసులు అరెస్టు చేశారు. ఆమె క్యాన్సర్తో బాధపడుతోంది. చికిత్స తీసుకోవడానికి వచ్చిన సమయంలో నాడు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందింది.
100కి పైగా దాడుల్లో హస్తం
కేంద్ర కమిటీ సభ్యుడైన ప్రయాగ్ మాంఝీ జార్ఖండ్, బిహార్, ఛత్తీస్గఢ్, ఒడిస్సాలో దాదాపు 100కి పైగా దాడుల్లో ప్రమేయం ఉంది. ఒక్క గిరిధి జిల్లాలోనే ఇతడిపై 50 కేసులతో పాటు రూ.కోటి రివార్డ్ ఉంది. ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహించేవాడని..తాజాగా పరస్నాథ్ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడి కోసం గాలింపు కొనసాగించారు. ఈ క్రమంలో ఎన్ కౌంటర్ జరిగింది. కాగా ప్రయాగ్ మాంఝీ స్వస్థలం ధనాబాద్ జిల్లా తుండీ పోలీస్స్టేషన్ పరిధిలోని దల్బుద.
ఈ ఏడాది జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 13 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. 2025 చివరికి రాష్ట్రాన్ని మావో రహిత రాష్ర్టంగా చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. 244 మంది మావోయిస్టులను రాష్ట్రంలో అరెస్టు చేశారు. పలు దళాల కమాండర్లతో కలిపి 24 మంది లొంగిపోయారు. జార్ఖంఢ్ ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు.
నక్సలిజాన్ని నిర్మూలించాలనే ప్రభుత్వ నిబద్ధత ఇలాగే కొనసాగుతుందని ట్వీట్ చేశారు.